సబ్‌ సెంటర్ లెవల్‌లో.. జన ఆరోగ్య సమితులు

సబ్‌ సెంటర్ లెవల్‌లో.. జన ఆరోగ్య సమితులు

మెదక్, నిజాంపేట, వెలుగు: ప్రజారోగ్యం కేంద్ర ప్రభుత్వ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. సర్కార్​ దవాఖానాల్లో అన్ని రకాల సౌలతులు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఫండ్స్‌ ఫండ్స్​ సక్రమంగా వినియోగించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు  హెల్త్​ సబ్​ సెంటర్​(హెచ్ఎస్ సీ) , ప్రైమరీ హెల్త్ సెంటర్​ (పీహెచ్​సీ), డిస్ట్రిక్ట్​ హాస్పిటల్​ ( డీహెచ్‌​) లెవల్‌లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మెదక్‌ జిల్లా కలెక్టర్‌‌ ఇప్పటికే హెల్త్‌ సొసైటీ మీటింగ్ పెట్టి అధికారులకు దిశానిర్దేశం  చేశారు. 

 పర్యవేక్షణ ఉండేలా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్రం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందుకోసం నేషనల్​ హెల్త్​ మిషన్​ (ఎన్‌హెచ్ఎం) కింద ఫండ్స్​ మంజూరు చేస్తోంది.  అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఫండ్స్​ సంక్రమంగా వినియోగం కావడం లేదు.  హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ (హెచ్ఏసీ)లు నామ్‌ కే వాస్తేగా మారడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.   హెచ్ఏసీ చైర్మన్లు అయిన ప్రజా ప్రతినిధులకు హాస్పిటల్స్‌కు సంబంధించి ఎలాంటి  సమాచారం ఉండడం లేదు. దీనిపై  జడ్పీ జనరల్​ బాడీ మీటింగుల్లో ఎంపీపీ, జడ్పీటీసీలు ఇప్పటికే పలుమార్లు అధికారులను నిలదీశారు.  దీంతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా  ఆస్పత్రుల పర్యవేక్షణకు కేంద్రం చేపట్టింది.  

కమిటీలు... ప్రతి నెలా మీటింగ్‌లు

హెల్త్​ సబ్​సెంటర్​లెవల్‌లో సర్పంచ్​చైర్మన్​గా,  మెడికల్​ ఆఫీసర్​ కో చైర్మన్​గా,  ప్రైమరీ హెల్త్​ సెంటర్ ​(పీహెచ్ సీ) లెవల్‌లో ఎంపీపీ చైర్మన్​గా  డిప్యూటీ డీఎంహెచ్‌వో కో చైర్మన్​గా, మెడికల్​ ఆఫీసర్​ మెంబర్​ సెక్రటరీగా  ‘జన్ ఆరోగ్య్  సమితి’  ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా ఆస్పత్రుల్లో  సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా  స్థాయిలో కలెక్టర్  చైర్మన్​గా  ‘జిల్లా హెల్త్  అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్​ సొసైటీ' ఏర్పాటు చేస్తున్నారు.  ఈ కమిటీలు ప్రతి నెలా మూడో శనివారం సభ్యులతో  పాటు, మహిళా శిశు సంక్షేమ, జిల్లా పంచాయతీ, విద్య తదితర శాఖలతో మీటింగ్‌లు పెట్టి..  ఆస్పత్రుల్లో సమస్యలు ఏంటి? పారిశుద్ధ్యం నిర్వహణ, రోగులకు కుర్చీలు, భోజనం, తాగునీరు, టాయిలెట్స్‌ తదితర అంశాలపై చర్చంచి కల్సించాల్సిన సౌకర్యాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు.  అలాగే రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి సరైన వైద్య సాయం అందించడం, నార్మల్​ డెలివరీ కావడానికి చేయాల్సిన ఎక్సర్​ సైజ్​ల గురించి అవగాహన కల్పిస్తారు.  ప్రతి పీహెచ్​సీ కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యేలా ఈ కమిటీలు కృషి చేయాల్సి ఉంటుంది. 

జిల్లాలో ప్రభుత్వ  ఆస్పత్రుల వివరాలు
    జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి - 1
    మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్​) - 1
    కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లు (సీహెచ్​సీ) - 3
    ఏరియా హాస్పిటల్​(ఏహెచ్​)  - 1
    ప్రైమరీ హెల్త్​ సెంటర్​ 
(పీ హెచ్​ సీ)లు - 18
    అర్బన్ ప్రైమరీ​ హెల్త్​ సెంటర్ (యూపీహెచ్​సీ)​ - 1
    హెల్త్​ సబ్​ సెంటర్​ లు  (హెచ్​ఎస్​ సీ) - 155


మంచి నిర్ణయం 

మెదక్​ జిల్లాలో హాస్పిటల్​అడ్వైజరీ కమిటీలు నామ్‌ కే వాస్తేగా మారాయి. పీహెచ్​సీలలో, జిల్లా హాస్పిటల్​లో మీటింగ్​లు పెట్టిన దాఖలాలు లేవు. దీంతో ఆస్పత్రులకు వస్తున్న ఫండ్స్​ ఏమవుతున్నాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో  సబ్​ సెంటర్, పీహెచ్‌సీ,  జిల్లా ఆస్పత్రుల్లో సేవలు మెరుగు పరిచేందుకు కమిటీలు వేయడం మంచి నిర్ణయం. 
- పంజా విజయ్ కుమార్,  నిజాంపేట జడ్పీటీసీ