- మే, జూన్ నెలల్లో రేషన్ కార్డున్నోళ్లందరికీ పంపిణీ
- కేంద్రం తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తున్న తరుణంలో పేదల ఆకలి కష్టాలపై కేంద్రం దృష్టి సారించింది. గత ఏడాది లాగే ఈసారి కూడా దేశంలోని పేదలకు ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న్ యోజన కింద వచ్చే మే, జూన్ నెలల్లో పేదలకు ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనున్నారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు ఇవ్వనున్నారు. దేశంలోని మొత్తం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 26 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూల కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు నగరాలను వదిలిపెట్టి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే పేదలను ఆదుకునే చర్యల్లో భాగంగా ఉచితంగా రేషన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది.