ఇరుకు గదుల్లో కరోనా వైరస్
ఎక్కువ సేపు బతుకుతది
వెంటిలేషన్ బాగుండాలె..
తక్కువ మంది ఉండటమే సేఫ్
చైనా రీసెర్చర్ల స్టడీలో వెల్లడీ
బీజింగ్: గాలిలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లను కనుగొన్నట్లు చైనా రీసెర్చర్లు వెల్లడించారు. ఎక్కువ మంది ఉండే ఇరుకు గదులు, వెంటిలేషన్ సరిగ్గా లేని రూములు, టాయిలెట్లలోని గాలిలో కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ ను గుర్తించినట్లు వారు చెప్పారు. కరోనా వైరస్ మొదలైన వుహాన్ లోని రెండు హాస్పిటల్స్ లో ఈ రీసెర్చ్ జరిగింది. సోమవారం ‘నేచర్ రీసెర్చ్’ జర్నల్ లో ఈ రీసెర్చ్ వివరాలు పబ్లిష్ అయ్యాయి. అయితే, ఈ వైరస్ కణాలు గాలిలోని సూక్ష్మ కణాలు, ఏరోసాల్స్ ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఉందా? అనేది ఇంకా తేలలేదని రీసెర్చర్లు వెల్లడించారు.
కరోనా వైరస్ సోకిన వారు దగినప్పుడు లేదా మాట్లాడినపుడు రెండు రకాల తుంపర్లు పడతాయన్నారు. పెద్దగా ఉన్న తుంపర్తు నేలపై, వస్తువులపై పడుతుండగా, చిన్న తుంపర్తు గాలిలోని కణాలు, ఏరోసాలస్ తో కలిసిపోతున్నాయని గుర్తించారు. రీసెర్చ్ లో భాగంగా 2 హాస్పిటల్స్ లోని ఇరుకు గదులు, వెంటిలేషన్ సరిగ్గా లేని టాయిలెట్లలోని గాలిని పరిశీలించగా, అందులో కరోనా జెనెటిక్ మెటీరియల్ ఉన్నట్లు కనుగొన్నారు. వీటి వల్ల ఇన్ ఫెక్షన్ ముప్పు ఎంత ఉందన్నది తెలియకున్నా.. వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవడం, ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండకపోవడమే మంచిదని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు.