వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారాన్ని సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) తాత్కాలిక డైరెక్టర్ మధు గొట్టుముక్కల.. చాట్ జీపీటీ పబ్లిక్ వర్షన్లో అప్లోడ్ చేశారు. ఈ మేరకు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను ఆయన చాట్ జీపీటీ పబ్లిక్ వర్షన్లో అప్లోడ్ చేశారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పినట్లు పొలిటికో అనే వార్తాపత్రిక ఒక కథనాన్ని వెలువరించింది.
చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనుమతి తీసుకొని మధు చాట్ జీపీటీని వాడుకున్నారని ఆ అధికారులు ఆరోపించినట్లు కథనం వెల్లడించింది. ‘‘డిపార్ట్మెంట్లోని ఇతర ఉద్యోగులకు చాట్ జీపీటీని వాడేందుకు అనుమతి లేదు. కానీ.. మధు మాత్రం అధికారులపై ఒత్తిడి చేసి ఆ ఏఐ చాట్ బాట్ను వాడుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారు” అని అధికారులు చెప్పినట్లు కథనం పేర్కొంది. అయితే, మధు అప్ లోడ్ చేసిన ఫైల్స్లో ఏవీ కూడా క్లాసిఫై కాలేదని, కానీ ఆయన అప్లోడ్ చేసిన ఫైల్స్ పబ్లిక్ కోసం కాదని, అవి సీఐఎస్ఏకు సంబంధించిన కాంట్రాక్టు డాక్యుమెంట్లు అని పొలిటికో వివరించింది. వాటిని బయటపెట్టకూడదని పేర్కొంది.
ఎవరీ మధు గొట్టుముక్కల?
భారత సంతతికి చెందిన మధు గొట్టుముక్కల సీఐఎస్ఏలో సీనియర్ మోస్ట్ పొలిటికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. చైనా, రష్యా వంటి ప్రత్యర్థి దేశాల నుంచి ప్రభుత్వ నెట్వర్క్ ను కాపాడడం సీఐఎస్ఏ విధి. అలాంటి సీఐఎస్ఏకు మధును నిరుడు మేలో తాత్కాలిక చీఫ్ గా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నియోమ్ నియమించారు.
