న్యూఢిల్లీ: జైషే మహ్మద్ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రవూఫ్ అజార్పై ఆంక్షలు విధించాలన్న ఇండియా, అమెరికా ప్రయత్నాలకు చైనా మోకాలడ్డింది. ఐక్యరాజ్య సమితి (యూఎన్) వేదికగా ఆంక్షల కోసం కొన్నాళ్ల నుంచి ఇండియా, అమెరికా ప్రతిపాదనలు చేస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాజాగా చైనా ప్రతిపాదన చేసింది. చైనా తీరును ఇండియా తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఆ దేశ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడింది.
పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడైన రవూఫ్ అనేక టెర్రర్ దాడుల్లో కీలక సూత్రధారి. 1999లో అఫ్గానిస్తాన్లో ఇండియా విమానం హైజాక్ ఘటనలో రవూఫ్ పాత్ర ఉంది. 2001లో పార్లమెంట్పై దాడిలోనూ ప్రధాన నిందితుడు. 2016లో పఠాన్కోట్ ఐఏఎఫ్ బేస్ క్యాంప్ పై జరిగిన టెర్రర్ అటాక్లోనూ నిందితుడే. పలు దేశాల్లోనూ రవూఫ్పై కేసులు ఉన్నాయి. రవూఫ్ను అంతర్జాతీయ టెర్రరిస్ట్గా గుర్తించాలని, విదేశాల్లో పర్యటించకుండా నిషేధించాలంటూ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా, అమెరికా కొన్నేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉండగా.. 14 దేశాలు ఇండియా, అమెరికా ప్రయత్నాలకు మద్దతిస్తున్నాయి. చైనా మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నది. దీని వల్ల కౌన్సిల్ నిర్ణయా నికి మరింత టైమ్ పట్టే అవకాశం ఉంది.