న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అజార్ను బ్లాక్ లిస్ట్లో చేర్చాలన్న ఇండియా ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్ భద్రతా మండలి 1267 ఐఎస్ఐఎల్, అల్ ఖైదా ఆంక్షల జాబితాలో అబ్దుల్ రవూఫ్ను చేర్చాలన్న ఇండియా ప్రతిపాదనను అడ్డుకుంది.
1974లో పాకిస్తాన్లో జన్మించిన జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్.. 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఐసీ 814 హైజాక్ లో, 2001లో పార్లమెంట్పై జరిగిన దాడిలో, 2016లో పఠాన్కోట్లోని ఐఏఎఫ్ స్థావరంపై జరిగిన అటాక్లో నిందితుడు. ఇవేకాకుండా ఇండియాలో అనేక టెర్రర్ దాడులకు ప్లాన్ చేసి అమలు చేశాడు. ఇతనిపై డిసెంబర్ 2010 నుంచే అమెరికా నిషేధం విధించింది.