బీజింగ్: చైనా సావరినిటీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని, ఎంతవరకైనా వెళతామని ఆ దేశ ప్రెసిడెంట్ జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ ముమ్మాటికీ తమ భూభాగమేనని, దానిని తమ నుంచి విడదీసేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టబోమని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ను హెచ్చరించారు. తైవాన్ జోలికి రావడమంటే నిప్పుతో చెలగాటమేనని, మాడి మసైపోతరని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు మంగళవారం అమెరికా ప్రెసిడెంట్తో జరిగిన వర్చువల్ మీటింగ్లో జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా తమ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జిన్పింగ్ చాలాసేపు మాట్లాడారు. తన స్పీచ్లో చాలా అంశాలను ప్రస్తావించి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
టెన్షన్లు రెచ్చగొట్టద్దు..
అమెరికా సాయంతో స్వాతంత్ర్యం పొందాలని తైవాన్ చేస్తున్న ప్రయత్నాలు, తైవాన్ను అడ్డుకుని తమ దేశాన్ని ఇరుకున పెట్టాలని కొంతమంది అమెరికన్లు చేస్తున్న ప్రయత్నాలు తమకు తెలుసని జిన్పింగ్ చెప్పారు. ఆ ప్రయత్నాలు బార్డర్లలో వాతావరణాన్ని రెచ్చగొడతాయని, దేశాల మధ్య సంబంధాలనూ దెబ్బతీస్తాయని జిన్పింగ్ ఇండైరెక్ట్గా హెచ్చరించారు. ‘ప్రపంచంలో ఒక్కటే చైనా ఉంది.. తైవాన్ అందులో భాగం. ఈ భూభాగం మొత్తం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వ పాలన కింద ఉంది. అఖండ చైనా సాధనే ప్రతీ ఒక్క చైనీయుడి కోరిక. శాంతియుతంగానే చైనా మొత్తం ఒక్కటి కావాలని కోరుకుంటున్నాం.. తైవాన్కు స్వాతంత్ర్యం కావాలంటూ రెచ్చగొట్టే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అని జిన్పింగ్ తెలిపారు.
ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడు..
చైనాకు జీవితకాల ప్రెసిడెంట్గా కొనసాగేందుకు పార్టీ ప్లీనంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్న జిన్పింగ్.. ఇప్పుడు ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. చైనా లీడర్గా 40 కోట్లకు పైగా జనాలకు సేవ చేయడం, వారితో కలిసి పనిచేయడం గొప్ప బాధ్యత. దీనిని నెరవేర్చే క్రమంలో తన సొంత బాగోగులనూ పట్టించుకోబోనని జిన్పింగ్ వివరించారు. రెండు దేశాల మధ్య విభేదాలు సహజమేనని, వాటిని సున్నితంగా డీల్ చేయాలని చెప్పారు. అమెరికా, చైనాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా చేయాలని పిలుపునిచ్చారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, శాంతియుతంగా అభివృద్ధివైపు కలిసి అడుగులేయాలని జిన్ పింగ్ కోరారు.