
నేడు మళ్లీ అసెం బ్లీ.. బలపరీక్షపై అదే టెన్షన్
కీలకం కానున్న సుప్రీం ఆదేశాలు.. కోర్టుకు మరో ఇద్దరు ఎమ్మెల్యే లు
కూటమికే బీఎస్పీ మద్దతు: కుమారస్వామికి మాయావతి భరోసా
పైకి నీతులు మాట్లాడే బీజేపీ నేతలు.. పక్క పార్టీ ఎమ్మెల్యే లను అడ్డగోలుగా కొనేసి రాజ్యాంగాన్ని జోక్ లా మార్చేశారు. అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల్ని తరలించింది బీజేపీ నేతలే అనడానికి కావాల్సినన్ని సాక్ష్యాధారాలున్నాయి. ఇవన్నీ సభలో మాట్లాడుతాం. గవర్నర్ ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా, బలపరీక్షపై సమగ్ర చర్చజరిపి తీరుతాం. చట్టసభల పవరేంటో తెలిసొచ్చేలా బీజేపీకి బుద్ధి చెబుతాం. ఆ తర్వాతగానీ నేను పదవి నుంచి తప్పుకోనని అన్నారు కుమారస్వామి.
‘‘బలం లేకున్నా పవర్లో కొనసాగాలని అనుకోవట్లేదు. కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ప్రజలకు తెలియాలి. పైకి నీతులు మాట్లాడే బీజేపీ నేతలు.. పక్క పార్టీ ఎమ్మెల్యేల్ని అడ్డగోలుగా కొనేసి రాజ్యాంగాన్ని జోక్లా మార్చేశారు. అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల్ని తరలించింది బీజేపీ నేతలే అనేందుకు సాక్ష్యాధారాలున్నాయి. ఇవన్నీ సభలో మాట్లాడుతాం. గవర్నర్ ఎన్ని డెడ్లైన్లు పెట్టినా, బలపరీక్షపై సమగ్ర చర్చజరిపి తీరుతాం. చట్టసభల పవర్ తెలిసొచ్చేలా బీజేపీకి బుద్ధి చెబుతాం. ఆ తర్వాతగానీ నేను పదవి నుంచి తప్పుకోను” అని కర్నాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. రెండ్రోజుల తర్వాత సోమవారం అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. బీజేపీ చేతిలో బలైపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రండంటూ రెబల్ ఎమ్మెల్యేలను కోరారు. కుమార సర్కారు కూలిపోయేదాకా కర్నాటకలో అడుగుపెట్టబోమని ముంబైలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కుమారస్వామికి సోమవారం చేయబోయేదే చివరి ప్రసంగమని, ఆయన తప్పుకోగానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షనేత యడ్యూరప్ప అన్నారు.
సుప్రీంకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా ఓటింగ్ చేపట్టేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ ఇండిపెండెంట్, కేపీజేపీ ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్ నగేశ్ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మైనార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కుమారస్వామి ప్రయత్నిస్తున్నారని, ఓటింగ్ను తప్పించుకునేలా ఆస్పత్రిలో చేరే డ్రామాకూ తెరతీశారని ఆరోపించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యాన్ని ప్రశ్నిస్తూ కుమారస్వామి, రెబల్స్కు విప్ జారీచేసే అధికారాలపై కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు గత వారం విడివిడిగా పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు కేసుల్ని సీజేఐ బెంచ్ సోమవారం విచారించనుంది.
స్వామికే సపోర్ట్: తేల్చేసిన మాయావతి
బలపరీక్షలో కుమార ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలంటూ బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ను ఆ పార్టీ చీఫ్ మాయావతి ఆదేశించారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు రాని కారణంగా గురు, శుక్రవారాల్లో అసెంబ్లీకి దూరంగా ఉన్న మహేశ్.. సోమవారం సభకు హాజరవుతానని తెలిపారు. 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో బీఎస్పీని కలుపుకునే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలం 116గా ఉంది. వీళ్లలో 16 మంది రాజీనామాలు చేయగా, అవి స్పీకర్ పరిశీలనలో ఉన్నాయి. ఒక ఇండిపెండెంట్, కేపీజేపీ ఎమ్మెల్యే సపోర్ట్తో బీజేపీ బలం 107కు పెరిగింది.