కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నరు? : రేవంత్ రెడ్డి

కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నరు? : రేవంత్ రెడ్డి
  • 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి 
  • అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..  
  • ఇకపై ఓపెన్ మార్కెట్​లో తక్కువ ధరకే కొనాలె 
  • విద్యుత్​పై సమగ్ర విధానం రూపొందించండి .. రైతులకు 
  • 24 గంటల కరెంట్ అందించండి 
  • గృహజ్యోతికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం 
  • విద్యుత్ శాఖపై సీఎం సుదీర్ఘ సమీక్ష   

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటివరకూ విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్‌‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్‌‌ కొనుగోలు ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్‌‌ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్‌‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌‌ ధరల వంటి అంశాలన్నీ నివేదికలో ఉండాలని స్పష్టం చేశారు. 

 బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుతో కలిసి విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధిక ధరతో విద్యుత్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం వివరించాలని ఆదేశించారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తే.. వారి వద్ద నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని తేల్చి చెప్పారు.

 24 గంటల నిరంతర విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరా, భవిష్యత్తులో పెరిగే విద్యుత్‌‌‌‌‌‌‌‌ అవసరాలను తీర్చడానికి వీలుగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కొత్త విద్యుత్‌‌‌‌‌‌‌‌ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. నిర్మాణంలోని విద్యుత్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలన్నారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలను చేపట్టాలన్నారు.   

విద్యుత్‌‌‌‌‌‌‌‌పై సమగ్ర పాలసీ రూపొందించండి..  

రాష్ట్రానికి సమగ్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని సీఎం అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్‌‌‌‌‌‌‌‌ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాత సమగ్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ రంగ నిపుణులతో  విస్తృతంగా సంప్రదింపులు నిర్వహిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ పాలసీలను అధ్యయనం చేసి, అన్నింటికంటే మెరుగైన పాలసీని రూపొందించి
నివేదిక సమర్పించాలంటూ ఈ మేరకు అధికారులను సీఎం ఆదేశించారు.   

గృహజ్యోతికి ప్రణాళికలు సిద్ధంచేయండి..   

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకూ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో గృహజ్యోతి స్కీం అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో జెన్‌‌‌‌‌‌‌‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుదుత్పత్తి, ఇతర కంపెనీల నుంచి చేస్తున్న విద్యుత్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లు, విద్యుత్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌, సరఫరా, డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరును అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో సీఎస్‌‌‌‌‌‌‌‌ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

సీఎం కారుకు జోడో యాత్ర స్టిక్కర్​

సీఎం రేవంత్​ రెడ్డి తన కారుకు రాహుల్ గాంధీ భారత్​ జోడో న్యాయ్​యాత్ర స్టిక్కర్​ను అంటించారు. రెండో విడత పాదయాత్రలో భాగంగా ఈ  నెల 14 నుంచి రాహుల్​ గాంధీ భారత్​ న్యాయ్​ యాత్రను ప్రారంభించనున్నారు.  మణిపూర్​ నుంచి మహారాష్ట్ర వరకు ఈ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్​ యాత్రకు సంఘీభావంగా.. రేవంత్​ తన కారుకు  స్వయంగా తానే స్టిక్కర్​ అంటించారు.