- ఆ టెండర్తో ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల నష్టం
- అవకతవకలపై పూర్తి వివరాలివ్వండి
- దర్యాప్తు సీబీఐకా? మరో సంస్థకు అప్పగించాలా? అనేది కేబినెట్లో నిర్ణయిస్తం
- ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించండి
- హెచ్ఎండీఏ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ టెండర్ విధానంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడిందని, అంత తక్కువ రేటుకే టెండర్లు ఎలా అప్పగించారని హెచ్ఎండీఏ అధికారులను ఆయన ప్రశ్నించారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలు ఉన్నాయి? దీనికి ఎవరెవరు బాధ్యులు? అనే కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్ లో హెచ్ఎండీఏ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలు అందజేయాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆయన ఆదేశించారు. ‘‘ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులపై కేసులు నమోదు చేయండి. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్ లో చర్చించి.. ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి ఉండే మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం” అని వెల్లడించారు.
టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని సీఎం రేవంత్కు అధికారులు వివరించారు. ‘‘మీరు చెప్పిన ప్రకారం 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. మరి అలాంటప్పుడు కేవలం రూ.7,380 కోట్లకే ఐఆర్ బీ కంపెనీకి ఎలా అప్పగించారు? హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయింది.
హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించింది. అందులో ప్రభుత్వానికి నష్టం తెచ్చే డీపీఆర్ ను ఎందుకు ఎంచుకున్నారు?” అని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. ‘‘టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ను చూపించి, 49 శాతం వాటాను విదేశీ కంపెనీకి అప్పగించింది. విదేశీ కంపెనీతో ఆ సంస్థ లావాదేవీలపైనా దర్యాప్తు చేయాలి” అని ఆదేశించారు.
ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ రేడియల్ రోడ్లు..
ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ‘‘సిటీ శివారు మున్సిపాలిటీల్లో అవసరమైన సౌలతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలి. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలి.
ల్యాండ్ పూలింగ్ ను వేగవంతం చేయాలి. అవసరమైతే ల్యాండ్ పూలింగ్, అక్కడి స్థలాల అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్సిళ్లు ఉన్నాయి. వీటిలో 2,031 పార్సిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయి. భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడాలి. డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడెంత స్థలముందో మ్యాపింగ్ చేయాలి. భూములతో పాటు అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టాలి. హెచ్ఎండీఏ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారి, ఇద్దరు ఎస్పీ ర్యాంక్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించాలి” అని సూచించారు.
లేఅవుట్లలో ఆదర్శ పాఠశాలలు..
హెచ్ఎండీఏ డెవలప్ చేసిన లేఅవుట్లలో ఆదర్శ పాఠశాలు ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారు. ‘‘హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లోని లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు సంస్థ అధీనంలో ఉన్నాయా? లేక ఆక్రమణకు గురయ్యాయా? అనేది తెలుసుకునేందుకు వెంటనే సర్వే చేయాలి. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. స్కూల్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పేరేట్ కంపెనీలు, పేరొందిన స్కూళ్ల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలి. ఆయా ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు స్కూళ్లలో కనీసం 25 శాతం కోటా ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చేలా చూడాలి. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి” అని అన్నారు.
దుబాయ్ తరహాలో హుస్సేన్ సాగర్ అభివృద్ధి..
హుస్సేన్సాగర్, దాని పరిసర ప్రాంతాలను బ్యూటీఫుల్ జోన్ గా తీర్చిదిద్దాలని అధికారులకు రేవంత్ సూచించారు. ఇటు అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరవీరుల జ్యోతి.. అటు నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు అభివృద్ధి చేయాలన్నారు. ‘‘హుస్సేన్ సాగర్ చుట్టూ ఆక్రమణలను తొలగించాలి. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్ మెంట్ జోన్, ల్యాండ్ స్కేప్స్ అభివృద్ధి చేయాలి. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్ కు మళ్లించి, దీన్ని పర్యాటక జోన్ గా మార్చాలి. ఈ ప్రాజెక్టుకు నమూనాలు తయారు చేయించండి” అని సూచించారు.
మోదీ, కేసీఆర్పాలనలో భయానక పరిస్థితులు
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అల్లర్లు, ఘర్షణలు జరిగితే పాలకులు అణచివేసేవారని.. కానీ, ప్రస్తుతం పాలకులే ఘర్షణలకు కారణమవుతున్నారని మణిపూర్, గుజరాత్ ఘటనలను సీఎం ఉదాహరించారు.
ఇది దేశ శ్రేయస్సుకు మంచిది కాదని, అంతా పరమత సహనం పాటించాలన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు సచివాలయంలో బుధవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. చర్చిల ఆస్తుల ఆక్రమణ సహా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు సీఎంకు వివరించారు. స్పందించిన సీఎం సమాజంలో శాంతి, ప్రేమ సందేశాలను పంచే క్రైస్తవులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. చర్చిల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, కొత్త చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ చర్చిని సందర్శించాలని చర్చి ప్రతినిధులు కోరగా.. అందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు.