రైతుల ఇండ్ల ముందు సహకార బ్యాంక్​ ఆఫీసర్ల హంగామా

రైతుల ఇండ్ల ముందు సహకార బ్యాంక్​ ఆఫీసర్ల హంగామా

కామారెడ్డి, వెలుగు:  జిల్లాలో   క్రాఫ్​ ​లోన్ల వసూలు కోసం స్పెషల్​డ్రైవ్​ పేరుతో కో ఆపరేటివ్​బ్యాంక్​ఆఫీసర్లు రైతుల ఇండ్ల ముందు  హంగామా  చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో లోన్లు చెల్లించని రైతుల ఇంటికి వెళ్లి ఆస్తులు జప్తు చేస్తామంటూ  బెదిరిస్తున్నారు. లోన్​కట్టని రైతుల ఇండ్ల తలుపులు తొలగించి, ఇంట్లోని సామాన్లు ఎత్తుకెళ్తూ వేధింపులకు దిగుతున్నారు.  దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార బ్యాంక్​ ఆఫీసర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. 

ఫైనాన్షియల్​ఇయర్​ఈ నెలాఖరున ముగియనుండడంతో లోన్ల వసూళ్ల టార్గెట్​ పూర్తి చేసేందుకు  కో ఆపరేటివ్​బ్యాంక్​ ఆఫీసర్లు స్పెషల్​ డ్రైవ్ చేపట్టారు.  ‘వన్​టైం సెటిల్​మెంట్​ఆఫర్​.. లోన్లు చెల్లిస్తారా..? ఆస్తులు జప్తు చేయమంటారా..?’  అంటూ రైతులను బెదిరిస్తున్నారు. పంటను అమ్మలేదని, అమ్మిన తర్వాత  బకాయిల్లో కొంతైనా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా..ఆఫీసర్లు కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సహకార బ్యాంకుల్లో అగ్రికల్చర్​కు సంబంధించి  లాంగ్​​టర్మ్​ లోన్లు సుమారు  రూ. 130 కోట్ల బకాయిలు ఉన్నాయి. అగ్రికల్చర్​ డెవలప్​మెంట్​లో  భాగంగా బోరు  మోటార్​, పైపులైన్​ ఏర్పాటు,  ట్రాక్టర్​ కొనుగోలుకు, కోళ్ల ఫారాలు, డెయిరీ ఫామ్స్​ ఏర్పాటుకు రైతులకు  సహకార బ్యాంక్​ ఈ లాంగ్​టర్మ్​ లోన్లు ఇస్తుంది. రైతుకు ఉన్న అగ్రికల్చర్​భూమిని బ్యాంక్​కు మార్టిగేజ్​ చేసిన తర్వాత​ లోన్​ ఇస్తారు.  రూ. 2  లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు లోన్​ ఇస్తారు.  లోన్​ సొమ్మును ఏడాదికి రెండు ఇన్​స్టాల్​మెంట్లుగా చెల్లించాలి. పంటల దిగుబడి సరిగ్గా రాక, ఆర్థిక ఇబ్బందులు, దీనికి తోడూ బ్యాంక్​ ఆఫీసర్లు కూడా మొదట్లో లోన్ల వసూళ్లపై  నిర్లక్ష్యం చేయడం  వల్ల బకాయిలు పేరుకుపోయాయి.  మిత్తికి  మిత్తి వేస్తుండడంతో  బకాయిలు రెండింతలయ్యాయి. దీంతో భారీగా పెరిగి రైతులు  చెల్లించలేని పరిస్థితి వస్తోంది.  

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలోని పలు మండలాల్లో సహకార బ్యాంక్​ ఆఫీసర్లు  లోన్ల  రికవరీ కోసం స్పెషల్ డ్రైవ్​ చేపట్టారు. నస్రుల్లాబాద్​ మండలంలోని పలు గ్రామాల్లో  రైతుల ఆస్తులు జప్తు చేస్తామంటూ హంగామా చేశారు. అంకోల్​లో కొందరు రైతుల ఇండ్ల తలుపులు లేపడం, ఇతర  సామాన్లు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్తులంతా కలిసి  అడ్డుకున్నారు.  పంట చేతికొచ్చినంక అమ్మి లోన్​కడతామని చెప్పినా వినిపించుకోలేదు. ఒకరిద్దరు రైతుల తలుపులు లేపడం, ఒక రైతు ఇంట్లో అతడి కొడుకు ల్యాప్​ ట్యాప్​ తీసుకెళ్తామని బెదిరించడం, ఇంకో రైతుకు చెందిన బైక్​ జప్తు  చేసేందుకు యత్నించారని రైతులు వాపోతున్నారు. రాజకీయ అండదండలున్న వారిని వదిలి  పేద, మధ్య రైతులనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని  రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బాన్స్​వాడ నియోజక వర్గంలోపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి చేపట్టిన పాదయాత్రలో  పలువురు రైతులు ఈ విషయంపై  కంప్లైంట్​కూడా చేశారు.  

బైక్ సీజ్​ చేస్తామంటే.. అప్పు చేసి కట్టిన.. 

‘మా నాయిన పసుపుల సాయిలు. 2015లో  కో ఆపరేటివ్​ బ్యాంకులో లోన్​తీసుకున్నడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చనిపోయిండు. లోన్​ తెచ్చిన సంగతి మాకు తెల్వది. ఇటీవల మా ఇంటికి కో ఆపరేటివ్​బ్యాంక్ ఆఫీసర్లు,  సిబ్బంది  వచ్చిన్రు. ‘మీ నాయిన పేరు మీద లోన్​బాకీ ఉంది. ఇప్పుడు చెల్లిస్తే చెల్లించండి.. లేకపోతే ఇంట్లోని వస్తువులు జప్తు చే స్తం’ అని కూసున్రు. నేను ఇంటికి వచ్చే సరికి సామాన్లు వెతుకుతున్రు. నా బైక్​ను తీసుకెళ్తామని చెప్పడంతో అప్పటికప్పుడు తెలిసినోళ్ల దగ్గర  రూ.38 వేలు   తెచ్చి కట్టిన. 
- శ్రీనివాస్,  అంకోల్ గ్రామం

వన్​టైమ్​ సెటిల్​మెంట్​వినియోగించుకోవాలని చెబుతున్నాం

లాంగ్​టర్మ్​ లోన్ల బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. రికవరీ కోసం వెళ్లినప్పుడు ఇప్పటి వరకు ఎక్కడా కఠినంగా వ్యవహరించలే.  లోను పైసలు వన్​ టైం సెటిల్​ మెంట్ కింద పెట్టిన ఆఫర్​ను వినియోగించుకోవాలని సూచిస్తున్నాం. నస్రుల్లాబాద్​ మండలంలో తలుపులు లేపామని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. 
-  గజానంద్,   సీఈవో, డీసీసీబీ బ్యాంక్​