
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. సమస్య పరిష్కారం మీ పరిధిలో లేకుంటే ఆ వివరాలను అర్జీదారుకు స్పష్టంగా చెప్పాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి 186 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చేర్యాల మండలంలోని శభాష్ గూడెం నుంచి జనగామ జిల్లా సాల్వాపూర్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం బడిబాట, టీచర్ల శిక్షణ, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. టీచర్లందరూ సమయపాలన పాటించాలన్నారు.
ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ మానిటరింగ్ చేయాలన్నారు. నేషనల్ పంచాయతీ అవార్డులకు అప్లై చేసే విధానం గురించి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి అధికారులకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో 9 థీమ్ లను ప్రామాణికంగా తీసుకున్నారని, జిల్లాలోని ప్రతి గ్రామం ఏదో ఒక థీమ్ లో అప్లై చేయాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో నాగరాజమ్మ, డీఐఈవో రవీందర్రెడ్డి, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్ టౌన్: అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. మెదక్కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు. మొత్తం 119 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వాటిలో భూసమస్యలకు సంబంధించి- 50, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 20, పింఛన్లు 3, ఎంప్లాయిమెంట్ -5, ఇతర సమస్యలు -41 ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బీడీ కార్మికుల ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
రామాయంపేట: రామాయంపేటలో బీడీ కార్మికులకు కేటాయించిన ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన ముదిరాజ్నాయకులు కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వం బీడీ కార్మికులకు కేటాయించిన ప్లాట్లను అక్రమంగా తన పేరుపై మార్చుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చిలుక గంగాధర్, మల్లేశం, గంగారాం, రవి, లింగం ఉన్నారు.
సంగారెడ్డి టౌన్: అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 71 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్, అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజా రాణికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.