
- గర్భిణితో కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు : 'అమ్మా భవానీ.. ఆరోగ్యం ఎలా ఉంది.. సమయానికి తింటున్నావా.. మందులు వేసుకుంటున్నవా..? టెన్షన్ పడకుండా మంచి ఆహారం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది’ అని గర్భిణితో కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 'అమ్మకు భరోసా'లో భాగంగా మంగళవారం వలిగొండ మండలం సుంకిశాలలో గర్భిణి భవాని ఇంటికి కలెక్టర్వెళ్లారు. ముందుగా గర్భిణి కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. ఆమె భర్త రఘుపతిని ఉద్దేశించి ఏం చేస్తున్నారు.. ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచే ఆకుకూరలైన మెంతి, తోటకూర, పుంటికూరను పప్పుతో కలిపి వారానికి రెండుసార్లు ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కొబ్బరి తిని గ్లాసు పాలు తాగాలని చెప్పారు. బెల్లంతో పల్లీలు కలుపుకొని తీసుకోవడంతోపాటు ఖర్జూర, డ్రైఫ్రూట్స్ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. ఐరన్ టాబ్లెట్లు లేదా ఇంజక్షన్ తీసుకోవాలని సూచించారు. అనంతరం న్యూట్రిషన్ కిట్ను భవానికి అందజేశారు. డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని చెప్పారు.