
సంగారెడ్డి టౌన్, వెలుగు: పోడు పట్టా భూములు పొందిన రైతులకు సోలార్ పంప్ సెట్ అందించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఇందిర సౌర గిరి వికాసం పథకంపై గిరిజన సంక్షేమ, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024–-25 సంవత్సరానికి 73 మంది రైతులను గుర్తించాలని ఆదేశించారు.
రెండున్నర ఎకరాల భూమిని ఒక గ్రూప్ గా తీసుకొని అందులోని రైతులకు ఒక యూనిట్ రూ.6 లక్షలతో మోటార్స్, సోలార్ పంప్ సెట్స్ పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ అధికారి అఖిలేశ్ రెడ్డి, డీఏవో శివప్రసాద్, జిల్లా ఫారెస్ట్ఆఫీసర్ శ్రీధర్ రావు పాల్గొన్నారు.
పేదలకు సన్న బియ్యం వరం..
పేదలకు సన్న బియ్యం వరం అని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్ లోని రేషన్షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకాన్ని, బియాన్ని, రికార్డులను, స్టాకును, కొత్త రేషన్ కార్డు లిస్టును చెక్ చేశారు. ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. వేలి ముద్రలో సాంకేతిక సమస్యలు వస్తే సాంకేతిక నిపుణుల బృందం పరిష్కరిస్తుందన్నారు. ఆమె వెంట అడిషనల్కలెక్టర్ మాధురి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ ఉన్నారు.
జేఎన్టీయూలో తాత్కాలిక నవోదయ స్కూల్
పుల్కల్: భూ భారతి చట్టం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ క్రాంతి అన్నారు. చౌటకూర్ మండలంలోని పోసానిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును సందర్శించి రైతులతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాకు నూతనంగా మంజూరైన నవోదయ విద్యాలయానికి సుల్తాన్ పూర్, జేఎన్టీయూలో తాత్కాలిక భవనాన్ని విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వారం రోజుల్లో మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు.