
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో నీటిపారుదల, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బ్యారేజీల్లో నీటిమట్టాలు ఎంత ఉన్నాయి, మిషన్ భగీరథ నీటి సరఫరా అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లీకేజీలకు వెంటనే రిపేర్లు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ డీఈ రఘువీర్, ఏఏ పాషా, పబ్లిక్ హెల్త్ ఈఈ కృష్ణ మోహన్, నీటిపారుదల, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.