మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ కేటాయింపులు 

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ కేటాయింపులు 
  • పోయినేడాది ఎడ్యుకేషన్​కు 7 శాతం, హెల్త్​కు 3 శాతమే ఫండ్స్ 
  • ఇందులోనే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు వచ్చే నిధులు కూడా.. 
  • పీఆర్ఎస్ ఇండియా రిపోర్టు

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ నిధులు కేటాయిస్తోంది. 2021–22 బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కు 7 శాతం, హెల్త్ కు 3 శాతమే నిధులు కేటాయించింది. పైగా ఇందులోనే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్​ల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను కలిపింది. 

ఈ రెండు రంగాలకు కేటాయింపుల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చివరి స్థానంలో ఉంది. ఈ మేరకు పీఆర్ఎస్ ఇండియా రూపొందించిన స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ రిపోర్టు వెల్లడించింది. 2021–22 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి అన్ని రాష్ట్రాల బడ్జెట్లను విశ్లేషించిన ఈ రిపోర్టు.. రాష్ట్రంలో విద్య, వైద్యం ఎంతటి అప్రాధాన్య రంగాలుగా మారాయో పేర్కొంది. 2021–22లో రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825 కోట్లు కాగా.. ఇందులో విద్యకు రూ.15,564 కోట్లు(6.74 %), వైద్యానికి రూ.6,295 కోట్లు(2.72 %) కేటాయించింది. 

ఎడ్యుకేషన్ లో ఢిల్లీ టాప్...  

పోయినేడాది దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ బడ్జెట్ లో సగటున 15.2 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాయి. ఆ ఏడాది దేశంలోనే అత్యధికంగా విద్యారంగానికి ఢిల్లీ ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్ రూ.69 వేల కోట్లలో రూ.17 వేల కోట్లు (25 శాతం) విద్యారంగానికే కేటాయించింది. ఆ తర్వాత అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు 19 శాతం చొప్పున.. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ 18 శాతం చొప్పున.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరం, సిక్కిం 17 శాతం చొప్పున.. జార్ఖండ్, మేఘాలయ 16 శాతం చొప్పున.. హర్యానా, జమ్మూకాశ్మీర్, కేరళ, ఒడిశా 15 శాతం చొప్పున నిధులు కేటాయించాయి. అరుణాచల్ ప్రదేశ్ 10 శాతం నిధులు కేటాయించగా, మిగతా రాష్ట్రాలన్నీ 13 శాతం పైనే బడ్జెట్ లో నిధులు కేటాయించాయి. 10 శాతంలోపు ఫండ్స్ కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ చివర్లో నిలిచింది. ఎడ్యుకేషన్ కు 7 శాతమే నిధులిచ్చిన సర్కార్.. కనీసం దేశ సగటు (15.2%)లో సగం కూడా కేటాయించకపోవడం గమనార్హం.  

హెల్త్ కు మరీ తక్కువ...  

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వైద్య రంగానికి కూడా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చాలా తక్కువగానే ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు పోయినేడాది బడ్జెట్ లో హెల్త్ కు సగటున 6 శాతం నిధులు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు మాత్రం 3 శాతం కూడా మించలేదు. నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్, హాస్పిటల్స్ కన్ స్ట్రక్షన్ అండ్ మెయింటనెన్స్ కింద కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఈ 3 శాతంలోనే ఉన్నాయి. రాష్ట్రాలు తమ బడ్జెట్ లో కనీసం 8 శాతం నిధులను వైద్యరంగానికి వెచ్చించాలని 2020లో నేషనల్ హెల్త్ పాలసీ రెకమండ్ చేసింది. చాలా రాష్ట్రాలు ఈ సిఫార్సులకు చేరువలో ఉండగా.. మన రాష్ట్రం మాత్రం అట్టడుగు స్థాయిలో ఉంది. ఢిల్లీ ప్రభుత్వం వైద్య రంగానికి 2021–22 బడ్జెట్ లో అత్యధికంగా 15.9 శాతం నిధులు కేటాయించగా.. మేఘాలయ 7.6 శాతం, అస్సాం, గోవా 7.1 శాతం చొప్పున, రాజస్థాన్ 7 శాతం నిధులు కేటాయించాయి. మిగతా రాష్ట్రాలన్నీ తమ బడ్జెట్ లో 4 శాతానికి పైగా నిధులు కేటాయిస్తే.. మన ప్రభుత్వం కేవలం 3 శాతంతో సరిపెట్టింది.