లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ గురువారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు . టెర్రరిస్టు స్థావరాలపైన సైనికులు మెరుపు దాడులు చేస్తే సాక్ష్యాలు కావాలని.. సైనికులను అవమానించే విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. సైన్యం విశ్వసనీయతపై వారు అనుమానాలు వ్యక్తం చేయడం బాధ కలిగించిందని, అందుకే పార్టీని వదిలి బయటికి వచ్చానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి తనకు బాగా నచ్చిందని, ఆయన విజన్ ఉన్న నాయకుడని మోడీపై ప్రశంసలు కురిపించారు. “ ఎంతో చరిత్ర కలిగిన పార్టీగా పేరు పొందిన కాంగ్రెస్ ప్రస్తుతం నాయకులను వాడుకుని వదిలేసే స్థాయికి చేరుకుంది. ఆ పార్టీలో ఇతర నాయకులు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకుని బతకాలి” అంటూ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. వడక్కన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన మెంటల్ కండిషన్ బాగోలేదని అందుకే అలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ
తరపున వడక్కన్ పోటీ చేసే అవకాశం ఉందని, సీటు ఇస్తామని హామీ ఇవ్వటంతోనే ఆయన ఆ పార్టీతో జతకట్టారని తెలుస్తోంది.

