మోరాదాబాద్: దేశ విభజనకు పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నానే కారణమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింల వల్ల దేశ విభజన జరగలేదని.. అందుకు ప్రధాన కారణం జిన్నా అని చెప్పారు. జిన్నాను భారత్కు తొలి ప్రధానిగా చేసి ఉంటే దేశ విభజన జరగకపోయేదని సుహుల్దేవ్ భారతీయ సమాజ్వాది పార్టీ చీఫ్ ఓపీ రాజ్భర్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఒవైసీ పైవిధంగా స్పందించారు. దేశ విభజనకు కాంగ్రెస్ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
‘ఆర్ఎస్ఎస్, బీజేపీ, సమాజ్వాది పార్టీ నేతలకు ఓ విషయం స్పష్టం చేస్తున్నా.. ముస్లింల వల్ల దేశ విభజన జరగలేదు. దానికి మహ్మద్ అలీ జిన్నానే కారణం. ఆయన వల్లే దేశం రెండుగా చీలిపోయింది. విభజన సమయంలో డిగ్రీ చదువుకున్న ముస్లింలు, నవాబులు లాంటి వారు మాత్రమే ఓటు వేసేవారు. దేశ విభజనకు అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణం’ అని ఒవైసీ చెప్పారు.