- పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే
- 15 కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు : పార్టీలోకి కొత్తగా వస్తున్న లీడర్లకు కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. పలువురు నేతల ఇండ్లకు వెళ్లి మరీ పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ హామీతో వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మొదలు మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్ వరకు ఇదే నడుస్తున్నది. ప్రస్తుతం 15 కీలక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
టికెట్ల విషయం మొత్తం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేతుల్లోనే ఉందని నేతలు చెప్తున్నా.. ఆ 15 నియోజకవర్గాల్లో కొత్తగా చేరిన నేతలకే హైకమాండ్ టికెట్లు కన్ఫర్మ్ చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. కొత్తవారికి పెద్దపీట వేస్తుండటం పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న లీడర్లను నారాజ్కు గురిచేస్తున్నది.
పొంగులేటితో స్టార్ట్
ఈ మధ్య కొత్త లీడర్లకు పెద్దపీట వేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో మొదలైందని పార్టీలోని పాత లీడర్లు అంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే వంటి లీడర్లు పొంగులేటితో సమావేశాలు నిర్వహించి పార్టీలోకి వచ్చేలా చూశారు. ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులూ టికెట్ హామీతోనే జాయిన్ అయ్యారని.. పొంగులేటికి పాలేరు, ఖమ్మంలో ఏదో ఒక టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
తన ముఖ్య అనుచరుడైన కోరం కనకయ్యకూ ఇల్లందు టికెట్ ఇవ్వాలని పొంగులేటి అడిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన తుమ్మల నాగేశ్వర్రావును కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరి ఎంట్రీతో ఖమ్మంలోని కాంగ్రెస్ పాత లీడర్లలో ఆందోళన పెరిగింది. వాళ్ల చేరికతో ఖమ్మంలో కాంగ్రెస్ బలపడిందని కొందరు నేతలు చెప్తున్నా.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాత లీడర్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. భట్టి విక్కమార్కకు ముఖ్య అనుచరుడైన రాయల నాగేశ్వరరావుతోపాటు రామసహాయం మాధవి రెడ్డి, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి పాలేరు టికెట్ రేసులో ఉన్నారు.
ఖమ్మం నుంచి మువ్వా విజయ్బాబు టికెట్ను ఆశిస్తూ అప్లికేషన్ పెట్టుకున్నారు. పొంగులేటి, తుమ్మల చేరికతో ఆ పాత లీడర్ల పరిస్థితి రివర్స్ అయింది. వాళ్లిద్దరికే ఆ రెండు (పాలేరు, ఖమ్మం) నియోజకవర్గాలూ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో బరి నుంచి పాత లీడర్లు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటు..
ఇల్లందు టికెట్పై ఆశలు పెట్టుకున్న బెల్లయ్య నాయక్, పొరిక సాయి శంకర్కు నిరాశ తప్పేలా లేదన్న చర్చ జరుగుతున్నది. ఆ స్థానం పొంగులేటి కోటాలో కోరం కనకయ్యకు టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతున్నది.
ఉమ్మడి పాలమూరులో కాస్త ఎక్కువే!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్త, పాత పంచాయితీ కొంచెం ఎక్కువగా ఉన్నది. టీడీపీలో కీలకంగా పనిచేసిన కొత్తకోట దయాకర్ రెడ్డి భార్య సీతా దయాకర్రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతా దయాకర్రెడ్డిని పార్టీలో చేర్పించేందుకు రేవంత్, మల్లు రవి వంటి సీనియర్ లీడర్లు ఆమె ఇంటికెళ్లి చర్చలు కూడా జరిపారు. ఆమెకు దేవరకద్ర సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. కానీ, ఇప్పటికే అక్కడ కారం ప్రదీప్గౌడ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలూ చేపడుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా రేవంత్, భట్టి వంటి సీనియర్లు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపి పార్టీలోకి తీసుకొచ్చారు. కొల్లాపూర్ టికెట్ను జూపల్లి ఆశిస్తున్నట్లు ప్రచారం నడుస్తున్నది. అయితే.. ఇప్పటికే అక్కడి టికెట్ కోసం చింతపల్లి జగదీశ్వర్ రావు, కేతూరి వెంకటేశ్వంటి పాత నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక, మహబూబ్నగర్ టికెట్ హామీతోనే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారని, అక్కడి నుంచి సంజీవ్ ముదిరాజ్ ఇప్పటికే రేసులో ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. గద్వాల జడ్పీ చైర్పర్సన్ అయిన సరిత తిరుపతయ్య.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. గద్వాల టికెట్ హామీతోనే సరిత పార్టీలోకి వచ్చారని, అయితే అక్కడ పాత లీడర్ ఎం. రాజీవ్ రెడ్డి టికెట్కోసం ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాగర్కర్నూల్ నుంచి కూచుకుళ్ల రాజేశ్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడైన ఆయన.. కొద్ది నెలల కిందనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారారు. కానీ, నాగర్ కర్నూల్ టికెట్ కోసం పాత లీడర్ నాగం జనార్దన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ టికెట్ తనకే కావాలని నాగం పట్టుబడుతున్నారు. కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చినోళ్లవైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.
వేముల వీరేశంకూ సీటు?
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి కొన్నాళ్లుగా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది. వీరేశంకు నకిరేకల్ టికెట్ లేదా తుంగతుర్తి టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ నకిరేకల్ టికెట్ ఇస్తే.. అక్కడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తుంగతుర్తి కన్ఫర్మ్ అయితే.. అక్కడ టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్కు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.
అద్దంకి దయాకర్ కూడా ఇప్పటికే అక్కడ గ్రౌండ్లో వర్క్ మొదలు పెట్టేశారు. ఇదే ఏరియా నుంచి పోటీకి నాగరిగారి ప్రీతం, పిడమర్తి రవి వంటివాళ్లు కూడా ఇంట్రస్ట్ చూపుతున్నారు. బీఆర్ఎస్ లీడర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఆయనకు కల్వకుర్తి టికెట్ ఇచ్చేలా డీల్ కుదిరిందన్న చర్చ పార్టీలో సాగుతున్నది. అయితే.. అక్కడ పాత లీడర్ వంశీచంద్రెడ్డి టికెట్ఆశిస్తున్నారు. బోథ్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. కాంగ్రెస్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మైనంపల్లికి రెండు టికెట్లిస్తే..!
రెండు టికెట్ల హామీతోనే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలుస్తున్నది. తనకు మల్కాజ్గిరి టికెట్, తన కొడుకు రోహిత్కు మెదక్ టికెట్ అడిగానని, ఇందుకు కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా స్పందించారని హన్మంతరావే స్వయంగా ప్రకటించారు. ఇక, మేడ్చల్ టికెట్ తన ముఖ్య అనుచరుడైన నక్కా ప్రభాకర్ గౌడ్కు ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. అయితే.. మల్కాజ్గిరి, మెదక్ టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి నుంచి నందికంటి శ్రీధర్ టికెట్ను ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డికి కీలక అనుచరుడిగా పేరున్న నందికంటి.. నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో గ్రౌండ్ను కూడా సెట్ చేసుకున్నారు.
మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ గెలవడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని, కాబట్టి రేవంత్ కోటాలో నందికంటి శ్రీధర్కే టికెట్ కన్ఫర్మ్ అన్న నమ్మకంలో పార్టీ కేడర్ కూడా ఉంది. అయితే.. ప్రస్తుతం మైనంపల్లి హన్మంతరావు ఎంట్రీ ఇస్తుండటంతో నందికంటి శ్రీధర్కు టికెట్ దక్కడం కష్టమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంతో నమ్మకంగా పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ ఇవ్వకుంటే తన దారి తాను చూసుకోక తప్పదన్న భావనలో శ్రీధర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. నందికంటి శ్రీధర్ను బుజ్జగించేందుకు బీసీ నేతలు మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి.. ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
టికెట్ల విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేదని బుజ్జగించే ప్రయత్నం చేశారు. హైకమాండ్ ప్రకటించే లిస్టులో తన పేరు లేకుంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే నందికంటి శ్రీధర్ తన ప్లాన్లలో తాను ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు మల్కాజ్గిరి టికెట్ మైనంపల్లికి ఇస్తే నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్లోకి వెళ్తారన్న ప్రచారమూ జోరుగా సాగుతున్నది.
పాత లీడర్లకు బుజ్జగింపులు
కొత్త లీడర్లకు టికెట్లు ఇస్తున్నా పాత లీడర్లను విస్మరించబోమని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ కోసం కొత్తోళ్లకు టికెట్ సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, దాని వల్ల పాత లీడర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగకుండా చూసుకుంటామని బుజ్జగిస్తున్నారు. ఎలాగూ అధికారంలోకి వస్తాం కాబట్టి.. ఎమ్మెల్యే టికెట్
దక్కనివాళ్లను ఎమ్మెల్సీ పదవిలోనో లేదా కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లోనో అడ్జస్ట్ చేస్తామని రేవంత్, భట్టి వంటి సీనియర్ నేతలు పలు సందర్భాల్లో హామీ ఇస్తూ వచ్చారు. అయితే, అధికారంలోకి వస్తే ఓకేగానీ.. రాకుంటే పరిస్థితేంటని పాత లీడర్లు డైలమాలో ఉన్నట్టు తెలుస్తున్నది.
ఆదిలాబాద్లో కొత్త, పాత లొల్లి
కొద్ది నెలల కింద బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డికి ఆదిలాబాద్ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లు ప్రచారం సాగుతున్నది. అక్కడ బీసీ నేత గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్ ఎప్పటి నుంచో టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్లో ఉన్న ఆ సీనియర్ లీడర్లను కాదని..
ఎన్నారై అయిన శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతు న్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటికే అక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి, సాజిద్ ఖాన్ మధ్య వర్గపోరు స్టార్ట్ అయింది. టికెట్ కన్ఫర్మ్ చేస్తే అది మరింత ముదిరి తార స్థాయికి చేరుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది.
రేఖా నాయక్కు ఇస్తే మా పరిస్థితేంది?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్కు.. ఈసారి ఆ పార్టీ నుంచి టికెట్రాలేదు. ఆమె బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం అప్లయ్ చేసుకున్నారు. ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్లో చేరారు. ఆసిఫాబాద్ టికెట్ను అడుగుతున్నారు. పార్టీ పెద్దలు మాత్రం ఇద్దరిలో ఒకరికే టికెట్ ఇస్తామని తేల్చి చెప్తున్నారు. ఎవరికిచ్చినా ఆ నియోజకవర్గాల్లోని పాత లీడర్లను పక్కన పెట్టాల్సిందేకదా అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఖానాపూర్ నుంచి చారులత రాథోడ్, వెడ్మ బొజ్జు వంటి పాత లీడర్లు పోటీకి సై అంటున్నారు. ఆసిఫాబాద్ నుంచి మర్సుకోల సరస్వతి రేసులో ఉన్నారు. ఇప్పటికే వారు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. తమను కాదని కొత్తవాళ్లకు టికెట్ ఇస్తే సహకరించబోమని వారు బహిరంగంగానే తేల్చి చెప్తున్నారు.