
చేర్యాల, వెలుగు : చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదన్న ఆగ్రహంతో ఓ కాంట్రాక్టర్ సర్కార్ బడికి తాళం వేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ‘మన ఊరి మన బడి’ పథకంలో భాగంగా ఆకునూరులోని జడ్పీహెచ్ఎస్లో చేపట్టిన డైనింగ్ హాల్, టైయిల్స్, ఎలక్ట్రికల్ పనులను ఎస్ఎంసీ మాజీ చైర్మన్, కాంట్రాక్టర్ కోతి దాసు పూర్తి చేశారు.
ఈ పనులకు సంబంధించి రూ. 8.50 లక్షల బిల్లు రెండేండ్లుగా పెండింగ్లో ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన దాసు గురువారం స్కూల్కు తాళం వేశారు. బిల్లు మంజూరు చేయాలని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పనుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. స్కూల్కు తాళం వేసిన విషయం తెలుసుకున్న చేర్యాల ఎస్సై నీరేశ్ స్కూల్కు వద్దకు వచ్చారు. డీఈవో, ఏసీపీలతో మాట్లాడించి నచ్చజెప్పడంతో దాసు స్కూల్ గేట్ తాళం తీశారు.