మగవాళ్లకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై టార్గెట్ పెడుతూ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చి వివాదంలో చిక్కుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆర్డర్స్పై ఎమర్జెన్సీ-2 అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆదేశాలను వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ సర్కార్.
వివాదాస్పదమైన ఆర్డర్ ఇదీ
‘కనీసం ఒక్క పురుషుడినైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి ఒప్పించండి.. లేదంటే ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది’ అని నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ డైరెక్టర్ ఛవీ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం 2019-20లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మగవాళ్లు కేవలం 0.5 శాతం ఉన్నారు. ఈ సంఖ్య మరీ ఘోరంగా ఉందని, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాల్లో నిర్వహించే హెల్త్ క్యాంపుల్లో కనీసం 5 నుంచి పది మంది మగవాళ్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించాలని ఆ సర్క్యులర్లో టార్గెట్ పెట్టారు. అలాగే గత ఏడాదిలో కనీసం ఒక్క పురుషుడికి కూడా కుటుంబ నియంత్రణ చేయించలేకపోయిన మేల్ మల్టీ పర్సస్ హెల్త్ ఉద్యోగుల్ని గుర్తించి వాళ్ల జీతాలను ఆపేయాలని ఆదేశించారు. కనీసం ఒక్కరినైనా ఆపరేషన్కు ఒప్పిస్తేనే ఆ జీతాలు ఇవ్వాలని, ఈ ఏడాదిలో కూడా టార్గెట్లో ఫెయిల్ అయితే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేయాలని పేర్కొన్నారు.
బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లా?
గురువారం నాడు ఈ సర్క్యులర్ వచ్చిన కొద్ది గంటలకే సోషల్ మీడియాలో ఆర్డర్ కాపీ వైరల్ అయింది. మగవాళ్లకు బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించేందుకు ఉద్యోగులపై ఒత్తిడి తేవడమేనంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్లు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు చేయించినట్లుగా బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్కు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఎమర్జెన్సీ-2 నడుస్తోందని, మేల్ మల్టీ పర్సస్ హెల్త్ ఎంప్లాయిస్ సరిగా పని చేయకుంటే మరో రకంగా చర్యలు తీసుకోవాలే కానీ, జీతాలు ఆపుతామనడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ సహా పలువురు నేతలు కూడా సీఎం కమల్నాథ్పై విమర్శలు చేశారు.
సర్క్యులర్ వెనక్కి.. అధికారిపై వేటు
భారీగా విమర్శలు రావడంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. కొద్ది గంటల్లోనే ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటూ ఆరోగ్య శాఖ మంత్రి తుల్సీ శిలావత్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వివాదాస్పద ఆర్డర్స్ ఇచ్చిన అధికారి ఛవీ భరద్వాజ్పై బదిలీ వేటు వేశారు. ఆయన్ని సచివాలయంలో ఓఎస్డీగా నియమించారు.
#UPDATE Madhya Pradesh govt removes National Health Mission state Director Chhavi Bharadwaj who issued the order informing male multi-purpose health workers that they would be compulsorily retired if they fail to convince even one man for sterilisation in 2019-20.
— ANI (@ANI) February 21, 2020