- రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
- రాబోయే 3 నెలల్లో 60% మందికి వైరస్
- ప్రముఖ ఎపిడమాలజిస్ట్ ఎరిక్ హెచ్చరిక
- మరణాలు లక్షల్లోనే ఉంటయ్
- జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక వైరస్ వ్యాప్తి తీవ్రం
- ప్రభుత్వం పట్టించుకోవట్లే..
- ఆస్పత్రుల్లో బెడ్లన్నీ ఫుల్.. నేలపై పడుకోబెట్టి చికిత్స
బీజింగ్: చైనాలో కరోనా విలయం కొనసాగుతోంది. జీరో కొవిడ్పాలసీ ఎత్తేశాక వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. ఇప్పటికే ఆస్పత్రులు, బెడ్స్ ఫుల్ అయ్యాయి. బెడ్స్ ఖాళీలేక డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డుల్లో ఒక్కో బెడ్పై ఇద్దరిని, బెడ్స్ మధ్య నేలపైన రోగులను పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. అంత్యక్రియల కోసం బీజింగ్లో ఒక్క క్రిమటోరియానికే రోజుకు 200 మృతదేహాలను తీసుకొస్తున్నారని అక్కడి సిబ్బంది చెప్పారు. మరోవైపు, రాబోయే రోజుల్లో చైనాలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. దేశ జనాభాలోని 60% మందికి రాబోయే 3 నెలల్లో కరోనా సోకుతుందని చైనా టాప్ ఎపిడమాలజిస్ట్ ఎరిక్ ఫెయిగిల్ డింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ప్రపంచ జనాభాలో 10 శాతానికి సమానమని చెప్పారు. వైరస్ మరణాలు కూడా లక్షల్లోకి పెరుగుతాయన్నారు.
కొవిడ్ ఆంక్షలు ఎత్తేశాక..
జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో వైరస్ కేసులు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్ సర్కారు పట్టించుకోవట్లేదని ఎరిక్ విమర్శించారు. వైరస్ బారిన పడేటోళ్లు పడనీ, కరోనాతో చనిపోయేటోళ్లు చావనీ అన్నట్లు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైరస్ కేసులు రెట్టింపు కావడానికి(ఆర్ వాల్యూ) గతంలో కొన్ని రోజులు పడితే.. ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే రెట్టింపు కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారు.
మరణాలను చెప్పట్లే..
కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని ఎరిక్ ఆరోపించారు. ఒక్క బీజింగ్ లోనే రోజూ వందలాది మంది వైరస్ తో చనిపోతున్నారని తెలిపారు. సిటీలోని ఓ క్రిమటోరియంకు గతంలో రోజుకు 30 నుంచి 40 మృతదేహాలను అంత్యక్రియల కోసం తెచ్చేవారని, ఇప్పుడు రోజుకు సుమారు రెండొందల మృతదేహాలను తీసుకొస్తున్నారని అన్నారు. పని ఒత్తిడి బాగా పెరిగిందని, రోజులో 24 గంటలూ మృతదేహాలను కాలుస్తున్నామని అక్కడి సిబ్బంది చెప్పారన్నారు. ఈ ఆరోపణలకు సపోర్టుగా ఆయన ట్విట్టర్లో వీడియోలను షేర్ చేశారు. బీజింగ్లోని ఓ ఆస్పత్రి వీడియోతో పాటు మృతదేహాలకు సంబంధించిన వీడియోను ఎరిక్ ట్వీట్ చేశారు. చైనా కేంద్రంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రపంచానికీ ముప్పు తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.