కొవిడ్ మహమ్మారి వచ్చిన మొదట్లో పిల్లలపై దాని ఎఫెక్ట్ తక్కువగానే ఉండేది. ఫస్ట్వేవ్లో కొవిడ్ సోకిన పిల్లల్లో ఎక్కువమందిలో ఏ లక్షణాలు (అసింప్టమాటిక్) కనిపించలేదు. సెకండ్ వేవ్లో సింప్టమాటిక్ కేసులు పెరిగాయి. ఈ పరిస్థితులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవేర్నెస్ ఉంటే చాలని అంటున్నారు పిడియాట్రీషియన్ డాక్టర్ షర్మిల. కె.
ఫస్ట్ వేవ్లో పిల్లల్లో కరోనా ప్రభావం తక్కువే. కేసులు తక్కువగా ఉండటానికి అప్పుడు లాక్ డౌన్ ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం తల్లిదండ్రులు బయటికిపోక తప్పట్లేదు. వాళ్ల ద్వారా పిల్లలకు కొవిడ్ సోకే ప్రమాదం ఉంది. ఫస్ట్ వేవ్లో కొవిడ్ బారినపడిన పిల్లల్లో శ్వాస, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్లో మాత్రం కొంచెం ప్రమాదకరమైన లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.
తీవ్రత చెప్పలేం
- కరోనా వైరస్లో మ్యుటేషన్స్ వల్ల దాని ప్రభావంలో కూడా మార్పులు వస్తున్నాయి. కొవిడ్ సెకండ్వేవ్లో కరోనా సోకిన పిల్లల్లో కళ్లు ఎర్రబడటం, నోటిపూత, చర్మంపై దద్దుర్లు, కాళ్ల వాపు, చేతుల వాపు, గుండెలోకి రక్తం తీసుకుపోయే రక్తనాళాల వాపు వస్తుంది. దీనిని ‘మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’ అంటారు. రక్తనాళాల వాపుకు సరైన ట్రీట్మెంట్ చేయకపోతే గుండె చుట్టూ నీరు చేరుతుంది.
- దానివల్ల ప్రాణహాని లేదా గుండెజబ్బులు రావచ్చు. కరోనా వైరస్ మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్లో దీని దాడి తీవ్రత ఎలా ఉంటుందో ముందే చెప్పలేం. పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉంటూ పిల్లల్ని జాగ్రత్తగా ఉండేలా చూడటమే ఎవరమైనా చేయగలిగింది.
ప్రకృతి వార్నింగ్ ఇస్తోంది
- సెకండ్ వేవ్లో కొవిడ్ సోకిన పిల్లల డెత్రేటు స్వల్పంగా పెరిగింది. కొన్ని రాష్ర్టాల్లో అయితే డబుల్ అయిందని అంటున్నారు. కొవిడ్ బారినపడ్డ వాళ్ల సంఖ్య కర్ణాటక రాష్ర్టంలో 160 శాతం పెరిగింది. ఏ దేశంలో కూడా కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేంత హెల్త్ సిస్టమ్ లేదు. ఉన్న దానిని మ్యాగ్జిమమ్ వాడుకునేందుకు ప్రయత్నించాలి.
- మెడికల్ సిస్టమ్ మీద ఆధారపడటం కంటే ముందు జాగ్రత్తే కొవిడ్ నుంచి కాపాడుకోవడానికి బెటర్ మెథడ్. లైఫ్ స్టయిల్, ఆలోచించే తీరులో మార్పు రావాలని కొవిడ్ అనుభవంతో ప్రకృతి చెబుతోంది. అది పట్టించుకోకపోతే కష్టాలే.
పిల్లలు జాగ్రత్త
- కొవిడ్ నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏవీ లేవు. పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలు కూడా అవే జాగ్రత్తలు పాటించాలి.
- జాబ్, బిజినెస్, పబ్లిక్లోకి వెళ్లాల్సి రావడం పెద్దలకు తప్పదు. బయటికి పోయి.. ఇంటికి వచ్చే పెద్దల నుంచే పిల్లలకు కోవిడ్ సోకుతోంది. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఉండే పిల్లలు సేఫ్గా ఉంటారు.
- వ్యాక్సినేషన్ ఎంత త్వరగా పూర్తయితే పిల్లలు అంత సేఫ్గా ఉంటారు. అవకాశం ఉన్న పెద్దవాళ్లంతా త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
- పెద్ద వాళ్లు ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాలి.
- అయిదేళ్లలోపు పిల్లలకు మాస్కులు పెట్టొద్దు.
- కొవిడ్ ఎలా సోకుతుందో పిల్లలకు చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలని ప్రతి రోజూ గుర్తు చేయాలి. కానీ, అది బెదిరించినట్లు ఉండొద్దు.
- ఒకవేళ స్కూల్స్ తెరిస్తే వెంటనే పంపకుండా, ప్రభుత్వం చెప్పే కొవిడ్ డేటా, వ్యాక్సినేషన్ డేటా తెలుసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.
డాక్టర్ షర్మిల. కె
సీనియర్ కన్సల్టెంట్ పిడియాట్రీషియన్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్