భర్తపై పోటీకి భార్య ... ఇంట్లోనే ప్రత్యర్థిని పెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే

 భర్తపై పోటీకి భార్య ... ఇంట్లోనే ప్రత్యర్థిని పెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే

రాజస్థాన్లో ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకిత్తిస్తున్న వేళ ఓ నియోజకవర్గం మాత్రం  అందరీ దృష్టిని ఆకర్షిస్తుంది.  అదే  రాజస్థాన్‌లోని దంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి  భార్యాభర్తలిద్దరూ ప్రత్యర్థులుగా తలపడే అవకాశం ఉండటంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇక్కడి సిట్టింగ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్‌.. ఈయన  పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏడుసార్లు ఎమ్మెల్యే నారాయణ్‌ సింగ్‌ కుమారుడు. మళ్లీ ఆయనకే అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.  ఇక ఈయన భార్య పేరు  రీటా చౌధరీ. గత ఎన్నికల్లో దంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.  2023 ఆగస్టులో జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)లో చేరారు. ఆ పార్టీలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలయ్యారు.

Also Read :- నేను ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్న

దంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా  రీటా చౌధరీని జేజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ కూడా వీరేంద్ర సింగ్‌ కే టికెట్ కేటాయించే అవకాశం ఉండటంతో  ఈ నియోజకవర్గం  రాజస్థాన్ లో హాట్ టాపిక్ గా మారింది.  తన భర్తపై పోటీ చేయడంపై   రీటా చౌధరీ మాట్లాడుతూ..  కాంగ్రెస్‌లో ఆయనకు ఇంకా టికెట్‌ ఖరారు కాలేదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడబోనన్నారు.  కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.  అభివృద్ధి, నీటి సమస్యలు, నిరుద్యోగం తదితర సమస్యలపై తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చౌదరి తెలిపారు. 

అటు వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని తెలిపారు.    2018లో తన తండ్రి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో వీరేంద్ర సింగ్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  నారాయణ్ సింగ్ 1972, 1980, 1985, 1993, 1998, 2003 , 2013 ఎన్నికల్లో  గెలిచారు.