ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ఈ నెల 5న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా నగరంలో గట్టి  బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. శనివారం క్యాంప్ ఆఫీస్ లో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ లు, డీసీపీ లు, ఏసీపీ, సీఐ, ఎస్సై లతో కలిపి మొత్తం2,371 సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  డీసీపీలు అరవింద్ బాబు, ఉషా విశ్వనాథ్, నరేందర్ రెడ్డి, గిరిరాజు తదితరులు పాల్గొన్నారు. 

 అల్లర్లు సృష్టిస్తే కేసులు పెడ్తం
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎవరైనా అల్లర్లు  సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కేసులు నమోదు చేసి, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని  నిజామాబాద్ ​సీపీ నాగరాజు హెచ్చరించారు. గతంలో రౌడీషీట్ తెరిచిన వారిపై పోలీసులు ఫోకస్​ పెట్టారన్నారు.  సోషల్ మీడియాలో మత విద్వేషాలను సృష్టించే  మెసేజ్​లు  పార్వర్డ్​ చేసినా,  సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్​ మీడియాలో ఇతరులకు ఇబ్బంది కలిగించే  ఎటువంటి ప్రచారాలను చేయొద్దన్నారు.  మండపాల వద్ద డీజే లకు పర్మిషన్​ లేదని,  నార్మల్​ సౌండ్ సిస్టమే వాడుకోవాలని సూచించారు. 

సారంగాపూర్​ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి

మాక్లూర్, వెలుగు: సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని సీపీఐ ఎంఎల్​ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేల్పూర్ భూమయ్య​ డిమాండ్​ చేశారు. రేపు సీఎం కేసీఆర్​ జిల్లాకు రానుండడంతో శనివారం బోర్గాం(కే)లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి  పలు డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ సారంగాపూర్ షుగర్​ ఫ్యాక్టరీ 26 ఏండ్లు నిరాటంకంగా కొనసాగి లాభాలను ఆర్జించిందన్నారు. సీఎం కేసీఆర్​ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీ తెరవాలని  కోరారు.  . పీవైఎల్​రాష్ట్ర అధ్యక్షుడు దేశెట్టి సాయి రెడ్డి,  న్యూ డెమోక్రసీ రూరల్ కమిటీ కార్యదర్శి జేపీ గంగాధర్, బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు రాధ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలు
లింగంపేట, వెలుగు:  ప్రొఫెసర్​ జయశంకర్​అగ్రికల్చర్​యూనివర్సిటీ 8వ ఆవిర్భావ  వేడుకలను శనివారం నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలోని  అగ్రికల్చర్​పాలిటెక్నిక్​ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. పాలిటెక్నిక్​ కాలేజీ ప్రిన్సిపాల్​మాధవిలత ప్రొఫెసర్లు, సైంటిస్టులతో కలసి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపాల్​ మాట్లాడుతూ   రైతులకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇవ్వడంలో యూనివర్సిటీ ముందుందన్నారు. కొత్త వంగడాలను సృష్టిస్తూ  రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేలా  సైంటిస్టులు  కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం, పంట మార్పిడి చేస్తూ లాభాలు పొందాలని సూచించారు. అనంతరం యూనివర్సిటీ సైంటిస్టులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల్తుమ్మెద ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్​  డాక్టర్​ మురళి, సైంటిస్టులు అనిల్​రెడ్డి, రేవంత్​నాథన్​, పాలిటెక్నిక్​ కాలేజీ స్టూడెంట్లు​ పాల్గొన్నారు.

కూతురిని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
బోధన్​, వెలుగు: కన్నకూతురిని లైంగికంగా వేధిస్తున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఏసీపీ కిరణ్​కుమార్​వివరాల ప్రకారం.. పట్టణంలోని రాకాసిపేట్​ప్రాంతంలోని గోసంబస్తీలో నివాసముండే శాఖమూరి మహేశ్​కొంత కాలంగా కన్న కూతురిను లైంగికంగా వేధిస్తున్నాడని అతడి భార్య సావిత్రి  రెండు రోజుల కింద పట్టణ పోలీసులకు కంప్లైంట్​చేసింది. కేసు నమోదు చేసిన సీఐ ప్రేమ్​కుమార్​మహిళా పోలీసులతో దర్యాప్తు చేయించారు. బాలిక తన తండ్రి తనతో వ్యవహరించిన తీరును పోలీసులకు వివరించింది. నిందితుడిపై  పోక్సో కేసు నమోదు చేసి  రిమాండ్​కు  పంపినట్లు  ఏసీపీ కిరణ్​కుమార్  తెలిపారు.  

కేంద్ర మంత్రి ఆరోపణలు సరికాదు
కామారెడ్డి /వర్ని, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​  చేస్తున్న  ఆరోపణలు సరికాదని ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ అన్నారు.  శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో   కొత్తగా శాంక్షన్​అయిన ఆసరా ఫించన్​  లబ్ధిదారులకు  కార్డులు అందజేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచిన ధరలపై కేంద్ర మంత్రి ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.  కామారెడ్డి నియోజక వర్గానికి కొత్త  పింఛన్లు 9,176  శాంక్షన్​అయినట్లు చెప్పారు.  ఎంపీపీ అంజనేయులు,  సొసైటీ చైర్మన్​ సత్యం, సర్పంచ్​రత్నాబాయి పాల్గొన్నారు.  

బీజేపీ కి కేసీఆర్​ భయం పట్టుకుంది
రాష్ట్రంలో కేసీఆర్‌‌‌‌ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ లీడర్లకు భయం పట్టుకుందని, అందుకే ఒకరి తర్వాత ఒకరు కేంద్ర మంత్రులను  తెలంగాణ పల్లెల్లో తిప్పుతున్నారని జడ్పీటీసీ నరోజి గంగారాం విమర్శించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక లో శనివారం 16 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్​చెక్కులను పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ కేసీఆర్​దెబ్బకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు సైతం గ్రామ స్థాయిలో తిరుగుతున్నారని  ఓట్లకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రజలను  మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. కావున అందరూ జాగ్రత్త గా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, వైస్ ఎంపీపీ  సాయిలు,  టీఆర్ఎస్​మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి  బాలరాజు,తహసీల్దార్‌‌‌‌ ముజీబ్ పాల్గొన్నారు.

ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ఇందల్వాయి, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని ధర్పల్లి జడ్పీటీసీ మెంబర్​బాజిరెడ్డి జగన్​ అన్నారు. శనివారం మండలంలోని గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణ  సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. రజకుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా జగన్​చెప్పారు.   గ్రామంలోని  జడ్పీ హైస్కూల్​లో  ఇంటర్​ డిస్ట్రిక్ట్​ త్రో బాల్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ఆయన ప్రారంభించారు. చదువుతో పాటు స్పోర్ట్స్​ లో  కూడా రాణించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్​ చైర్మన్​ సాంబారి మోహన్​, ఎంపీపీ రమేశ్​నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

రాజాసింగ్​పై  కేసులు ఎత్తివేయాలి
పిట్లం/ భిక్కనూరు, వెలుగు: గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై అక్రమ కేసులను నిరసిస్తూ పిట్లంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్​దళ్​ ఆధ్వర్యంలో బంద్​ నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి  మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్​పీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజాసింగ్​పై  పీడీ యాక్టును ఎత్తివేసి, మంత్రి కేటీఆర్​పై పెట్టాలని డిమాండ్​చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న మునావర్​కామెడీ షోను వద్దని చెబుతున్నా నిర్వహించారని ఆరోపించారు.   హిందూ సంఘాల నాయకులు అశోక్​రాజ్​, శివకుమార్​, కృష్ణంరాజు, గోపి  ఉన్నారు.

భిక్కనూరులో బంద్​ ప్రశాంతం
రాజాసింగ్​అరెస్ట్​కు నిరసనగా భిక్కనూరులో హిందూ, శివసేన యువకులు బంద్​నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కేసీఆర్​ ప్రభుత్వం  ముస్లింల ఓట్ల కోసం  హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే  వచ్చే ఎన్నికల్లో  టీఆర్ఎస్​పార్టీకి డిపాజిట్​రాకుండా చేస్తామని హెచ్చరించారు. 

పనిభారంతో బాధపడుతున్నం:తహసీల్దార్​ శ్రీకాంత్​రావు
కోటగిరి, వెలుగు: కోటగిరి తహసీల్దార్ ఆఫీస్​లో 79 మంది చేసే పనిని  ఇద్దరమే చేస్తున్నామని, పని భారం పెరుగుతోందని తహసీల్దార్​ శ్రీకాంత్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తహసీల్దార్​ఆఫీస్​లో మీడియాతో మాట్లాడిన ఆయన మండలంలో  మొత్తం 34 రెవెన్యూ  గ్రామాలు ఉన్నాయని, 9 గ్రామాల వీఆర్వోలను ఇటీవలే ప్రభుత్వం వేరే శాఖలకు అటాచ్​ చేసిందన్నారు. 70 మంది వీఆర్‌‌‌‌ఏలు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారని  తెలిపారు. తహసీల్దార్​ ఆఫీస్​ పరిధిలో డబుల్​ బెడ్రూమ్ స్కీమ్​మొదలుకొని  అన్ని సేవలు తాను, ఆర్ఐ ఇద్దరమే చూసుకోవాల్సి వస్తోందని వాపోయారు.  మండలానికి ఇద్దరు ఆర్‌‌‌‌ఐలు ఉండాల్సి ఉండగా  ఒక్కరే ఉన్నారని తెలిపారు. వెంటనే తహసీల్దార్​ఆఫీస్​కు సిబ్బందిని నియమించాలని శ్రీకాంత్ రావు ఉన్నతాధికారులను కోరారు. ఆర్ఐ సయ్యద్ హుసేన్ ఉన్నారు.

ఈ నెల 5న ప్రజావాణి రద్దు
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్​లో ఈ నెల 5న జరిగే ప్రజావాణిని నిర్వహించటం లేదని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల   రద్దు 
 చేస్తున్నట్లు చెప్పారు.

టీఆర్ఎస్ ​ఫ్లోర్​ లీడర్​గా మీర్జా ఆఫీజ్​బేగ్
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి మున్సిపాల్టీలో టీఆర్ఎస్ ​  ఫ్లోర్​ లీడర్​గా 18వ వార్డు కౌన్సిలర్​ మీర్జా ఆఫీజ్​ బేగ్ ను​ నియమించినట్లు ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ మేరకు మున్సిపల్ కమిషనర్​కు లెటర్​ పంపినట్లు చెప్పారు.

స్టూడెంట్లకునోట్​బుక్స్​ పంపిణీ
లింగంపేట, వెలుగు: మండలంలోని నల్లమడుగు ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్లకు శనివారం రెడ్​ క్రాస్ ​సొసైటీ ఎల్లారెడ్డి డివిజన్​ అద్యక్షుడు సంగన్నగారి రవిగౌడ్​ నోట్​బుక్స్​, డిక్షనరీలను  పంపిణీ చేశారు.  రూ.10 వేల విలువ గల  మెటీరియల్​ పంపిణీ చేసినట్లు రవిగౌడ్​ తెలిపారు. హెడ్మాస్టర్ ​సంగూబాయి, సొసైటీ సభ్యులు అశోక్ పాల్గొన్నారు. 
టై, బెల్టుల పంపిణీ
లింగంపల్లి ఖుర్ధు హైస్కూల్​ స్టూడెంట్లకు అదే గ్రామానికి  చెందిన రిటైర్డ్  హెడ్మాస్టర్​బండి లక్ష్మయ్య రూ. 4వేల విలువైన టై, బెల్టులు, ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. స్కూల్​ డెవలప్​ మెంట్​ కోసం తన వంతుగా
 రూ.1లక్ష రూపాయలను  డిపాజిట్​ చేసినట్లు ఆయన తెలిపారు. 

తప్పించుకు తిరుగుతున్న దొంగ అరెస్ట్
బాన్సువాడ, వెలుగు:  బీర్కూర్ ​మండలం తిమ్మాపూర్​ వేంకటేశ్వరాలయంలో చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న దొంగను శనివారం పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ మురళి వివరాల ప్రకారం..   రుద్రూర్ మండలం రాయకూరు గ్రామానికి చెందిన  గైని కిరణ్.. ఆగస్టు 27 రాత్రి మరో వ్యక్తితో కలిసి ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి నగదు, ఆలయంలోని బంగారం, వెండి దోచుకెళ్లాడు. ఆలయ నిర్వాహకుల కంప్లైంట్​మేరకు  కేసు ఫైల్​చేసిన పోలీసులు అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తుండగా  శనివారం పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి తులం బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.  

ప్రతి స్టూడెంట్ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: ఎంపీ ధర్మపురి అర్వింద్ 
ఆర్మూర్, వెలుగు : ప్రతి స్టూడెంట్  ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కుతో  మంచి పరిపాలనా దక్షత కలిగిన నాయకుడిని ఎన్నుకోవచ్చునని ఎంపీ ధర్మపురి అర్వింద్​ చెప్పారు. శనివారం బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఇన్​చార్జి, క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్​ అల్జాపూర్ శ్రీనివాస్ బర్త్​ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం చేపూర్ లోని ఇంజినీరింగ్​ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అర్వింద్​ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మామిడిపల్లిలోని తపస్వీ తేజో నిలయంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. క్షత్రియ స్కూల్, ఇంజినీరింగ్​కాలేజ్​, జూనియర్ కాలేజ్ లో మొక్కలు నాటారు.  కాలేజీ సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్​, లయన్స్ క్లబ్​ ప్రెసిడెంట్​ చెన్న రవి పాల్గొన్నారు.  

ప్రారంభోత్సవ పనులు స్పీడప్ ​చేయండి: కలెక్టర్​సి. నారాయణరెడ్డి
నిజామాబాద్, వెలుగు : కొత్త కలెక్టరేట్ ఏర్పాట్లను  వేగంగా  పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.     కలెక్టరేట్​ను సీఎం కేసీఆర్​ సోమవారం ప్రారంభించనున్నారు.  శనివారం కలెక్టర్​ ఏర్పాట్లను  పరిశీలించారు.  ప్రారంభోత్సవ శిలాఫలకంతో పాటు ఆయా అధికారుల ఛాంబర్లు, మీటింగ్ , మినీ కాన్ఫరెన్స్ హాల్స్​ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం సాయంత్రం లోపు అన్ని హంగులతో కలెక్టరేట్​ను సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు  సమన్వయంతో పనిచేస్తూ వారికి కేటాయించిన బాధ్యతలను పక్కాగా నిర్వర్తించాలని ఆదేశించారు.  అడిషనల్​ కలెక్టర్ బి.చంద్రశేఖర్,  ఆర్డీవో రవి, ఆర్ అండ్ బీ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్  ఉన్నారు. 

అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
నిజామాబాద్ బార్డర్​లోని ఇందల్వాయి మండలం చంద్రాయన్​పల్లి నుంచి  డిచ్ పల్లి వరకు 44 వ నేషనల్​హైవేకు  ఇరువైపులా హరితహారం కింద నాటిన మొక్కలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం పరిశీలించారు. డిచ్ పల్లి ఐ-ల్యాండ్ వద్ద, మరికొన్ని ప్రదేశాల్లో అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణలో లోపాలను గుర్తించిన కలెక్టర్.. వాటిని సరిచేయాలని అధికారులకు సూచించారు. మెయిన్ ​మీడియన్ నిర్వహణను సరిచేయాలని హైవే అథారిటీస్​ ఆఫీసర్లకు  సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, జిల్లా పంచాయతీ రాజ్​ఆఫీసర్​జయసుధ, ఎఫ్​ఆర్​వో హిమచందన ఉన్నారు.