
న్యూఢిల్లీ: ఇండియా హై గ్రోత్ రేటు (అధిక వృద్ధి) ప్రపంచానికి చాలా మంచిదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా చెప్పారు. 2022లో ఇండియా ఎకానమీ 8.2 శాతం గ్రోత్ సాధించి, ప్రపంచంలోనే వేగంగా ఎదిగే ఎకానమీ అవుతుందని ఇంతకు ముందే ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ గ్రోత్ రేటు చైనా గ్రోత్ రేటు 4.4 శాతం కంటే దాదాపు రెట్టింపు. 2022లో గ్లోబల్ గ్రోత్ రేటు అంతకు ముందు ఏడాదిలోని 6.1 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిపోనుందని కూడా ఐఎంఎఫ్ తన అంచనా రిలీజ్ చేసింది. 2022లో ఇండియా గ్రోత్ రేటు అంచనా కొద్దిగా తగ్గినప్పటికీ, వేగంగా ఎదుగుతున్న దేశం అదేనని, 8.2 శాతం చాలా మెరుగైన గ్రోత్ రేట్ అని క్రిస్టినా జార్జివా పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో స్లోడౌన్ సమస్యలను తెస్తోందని, ఇలాంటి టైములో ఇండియా ఎక్కువ గ్రోత్ రేటు సాధించడం సంతోషకరమైనదని అన్నారు. గ్లోబల్గా ఇండియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సోలార్ అలయన్స్లో చేరడం ద్వారా ఇండియా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముందడుగు వేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీ20 దేశాలకు వచ్చే ఏడాది ఇండియా నాయకత్వం వహించనుందని చెప్పారు.