ఢాకా, కోల్కతా : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్’ తుఫాన్ సోమవారం ఉదయం బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 135 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ధాటికి బెంగాల్ తీరం చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలతో బంగ్లాదేశ్తోపాటు బెంగాల్లో పలుచోట్ల వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ బంగ్లాదేశ్లో ఏడుగురు, బెంగాల్లో ఇద్దరు మృతిచెందారు. కోల్కతాలోని ఎంటల్లీ బిబిర్ బగన్ ప్రాంతంలో గోడకూలి ఒకరు మృతిచెందగా, మౌసినీ ఐలాండ్ నంఖానాలో గుడిసె కూలి ఓ వృద్ధురాలు కన్నుమూసిందని అధికారులు తెలిపారు.
ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీరప్రాంతాల్లోని లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటడంతో రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. కాగా, తుఫాన్ వల్ల కోల్కతా ఎయిర్పోర్ట్లో రద్దు చేసిన విమాన సర్వీసులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రతికూల వాతావరణంతో 8 సర్వీసులను దారిమళ్లించాల్సి వచ్చిందని తెలిపారు.
బలహీనపడుతున్న తుఫాన్
తుఫాన్ సోమవారం ఉదయం బలహీనపడిం దని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచనలు జారీచేశారు. ఈ ఏడాది వర్షాకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి తుఫాన్కు రెమాల్ అని ఒమన్ నామకరణం చేసింది. రెమాల్ అంటే అరబిక్లో ఇసుక అని అర్థం.