
- ఎంజీబీఎస్ వైపు ట్రాఫిక్ మళ్లింపు
బషీర్బాగ్, వెలుగు: సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మార్గాలను చూయిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే చాదర్ఘాట్ బ్రిడ్జిని ఉదయం 11:30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు.
దిల్సుఖ్నగర్, సైదాబాద్, మలక్పేట నుంచి వచ్చే వాహనదారులు సాధారణంగా చాదర్ఘాట్ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని, చాదర్ఘాట్ బ్రిడ్జి మీదుగా రంగమహల్, జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు వెళ్తారు. అయితే, ఈ మార్గంలో తీవ్ర రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా చాదర్ఘాట్ సర్కిల్ నుంచి స్ట్రెయిట్గా వెళ్లి ఎంజీబీఎస్ సర్కిల్వద్ద రైట్ తీసుకొని, శివాజీ బ్రిడ్జి మీదుగా ఉస్మానియా, ఎంజే మార్కెట్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ మార్గంలో వెళ్లడం ద్వారా త్వరగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఉదయం 11:30 గంటల తరువాత యథావిధిగా చాదర్ ఘాట్ మీదుగా వాహన రాకపోకలు అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు సహకరించాలని డీసీపీ కోరారు.