- మళ్లీ పెరుగుతుందంటున్న కంపెనీలు
చిన్న కార్లపై జనానికి మక్కువ తగ్గుతోంది. రేటు ఎక్కువైనా ఫర్లేదు.. ఖరీదైన కార్లే కావాలంటున్నారు. టూవీలర్ మార్కెట్లోనూ ఎంట్రీ-లెవల్, నాన్-ఎలక్ట్రిక్ వెహికల్స్కు డిమాండ్ తగ్గుతోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) లెక్కల ప్రకారం..110సీసీ మోటార్సైకిళ్ల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో విపరీతంగా తగ్గాయి. నాలుగేళ్ల క్రితం ఇదే కాలంతో పోలిస్తే 42 శాతం తక్కువగా ఉన్నాయి. 125సీసీ స్కూటర్ల మార్కెట్ 36శాతం తగ్గిపోయింది.
న్యూఢిల్లీ: ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీలకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంట్రీ లెవల్ కార్లు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. కస్టమర్లు ఖరీదైన కార్లవైపు చూస్తున్నారు. ఎంట్రీ లెవల్ కార్లకు బదులు హైఎండ్ మోడల్స్ను ఇష్టపడుతున్నారు. 2016–-17లో భారతదేశంలో అమ్మడైన ప్రతి రెండు కార్లలో దాదాపు ఒక కారు.. ఎంట్రీ లెవల్ వెహికలే! ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారతదేశంలో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో బడ్జెట్ సెగ్మెంట్ అమ్మకాలు 42 శాతం పడిపోయాయని కంపెనీలు చెబుతున్నాయి. టూవీలర్ వెహికల్ మార్కెట్లో కూడా ఎంట్రీ-లెవల్, నాన్-ఎలక్ట్రిక్ బండ్లకు ఆదరణ తగ్గుతోంది.
సియామ్ లెక్కల ప్రకారం, 110సీసీ మోటార్సైకిళ్ల అమ్మకాలు నాలుగేళ్ల క్రితం జూన్ క్వార్టర్తో పోలిస్తే 42శాతం తక్కువగా ఉన్నాయి. 125సీసీ స్కూటర్ల మార్కెట్ 36శాతం తగ్గిపోయింది. కస్టమర్ ఆసక్తి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది. సబ్– కాంపాక్ట్ ఎస్యూవీలతో సహా అనేక మోడళ్లు కూడా ఈ విభాగంలో విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్ను వదిలిపెట్టబోమని మారుతీ సుజుకి ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రకం కార్లకు గిరాకీ మళ్లీ వస్తుందని మారుతీ సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.
ఇండియాలో టూవీలర్లు తక్కువే...
అనేక ఇతర ఆసియా దేశాల కంటే భారతదేశంలో టూ వీలర్ వెహికల్స్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. అలాగే అనేక రాష్ట్రాల్లో టూవీలర్ల వాడకం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ఈ విషయాలను బట్టి చూస్తే ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ మంచి భవిష్యత్ ఉందని హీరో మోటోకార్ప్ ప్రతినిధి ఒకరు అన్నారు. ఆధార్ ఆధారిత లోన్లు, పంట-దిగుబడి ఆధారిత కిస్తీలు, క్యాష్ బోనస్, తక్కువ డౌన్ పేమెంట్ వంటి సదుపాయాల ద్వారా ఇన్ఫ్లేషన్ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు.
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా కూడా త్వరలో 100సీసీ మోటార్సైకిల్ను విడుదల చేయనుంది. ఇది ఇప్పటి వరకు 100 సీసీ బండిని లాంచ్ చేయలేదు. దీంతో మిగతా కంపెనీలూ ఈ సెగ్మెంట్పై ఫోకస్ చేస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వింకేష్ గులాటి అన్నారు. రాబోయే పండుగ సీజన్ ఎంట్రీ-లెవల్ టూ-వీలర్ సెగ్మెంట్ దూసుకెళ్తుందని చెప్పారు. అమ్మకాలు తగ్గిపోతున్నప్పటికీ కంపెనీలు నిరాశపడటం లేదు. ప్రస్తుతం మనదేశంలో 100 సీసీ బండ్ల వాటా 35–-37శాతం ఉందని, ఇకముందు ఇంకా పెరుగుతుందని హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అట్సుషి ఒగాటా తెలిపారు.