దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలో రోజు రోజుకు పడిపోతుండటంతో ప్రజల జీవన విధానం అతలాకుతలం అవుతోంది. 3.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిన ఉష్ణోగ్రతతో ఢిల్లీ ప్రజలు సతమతమౌతున్నారు. వరుసగా రెండో రోజు ఈ శీతాకాలపు అత్యంత చలి రాత్రి నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంలో చలి మరియు దట్టమైన పొగమంచు కమ్ముకుందని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో రెడ్ అలర్ట్ జారీ చేశామని, చలి, పొగమంచు కారణంగా రాజస్థాన్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. చలిగాలుల పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో రానున్న 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో 200 మీటర్ల విజిబిలిటీ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
చలి, పొగమంచు ఢిల్లీ మరియు దేశంలోని అనేక ప్రాంతాల్లో పద్దెనిమిది రైళ్లు 1-6 గంటలు ఆలస్యమయ్యాయి. దీంతో పాటు ఢిల్లీకి రావాల్సిన ఐదు విమానాలు ఆలస్యమయ్యాయి.