హైదరాబాద్, వెలుగు : సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో జోరు తగ్గుతోందా...అంటే అవుననే చెబుతోంది తాజా నైట్ఫ్రాంక్ రిపోర్టు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ అంతకు ముందు ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 16 శాతం తగ్గి 4,307 యూనిట్లకు పరిమితమైనట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ అపార్ట్మెంట్ల విలువ రూ. 2,198 కోట్లని తెలిపింది. వీటిలో 71 శాతం ఇండ్ల విస్తీర్ణం వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగులని వివరించింది. ఈ ఏడాది 9 నెలల్లో మొత్తం 50 వేల ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ. 25,094 కోట్లని పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్తో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది. సెప్టెంబర్ 2021 చివరి నాటికి రూ. 27,640 కోట్ల విలువైన 62,052 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్గా పరిగణిస్తున్నారు.
అమ్ముడవుతున్న రెసిడెన్షియల్ యూనిట్లలో రూ. 25 నుంచి రూ. 50 లక్షల విలువైన ఇండ్ల వాటా 55 శాతమని నైట్ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఇలాంటి ఇండ్ల అమ్మకాలు 39 % పెరిగినట్లు పేర్కొంది. రూ. 25 లక్షల లోపు ఇండ్ల అమ్మకాలు మాత్రం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 16 % తగ్గినట్లు వివరించింది. రూ. 50 లక్షలకు మించిన ఇండ్ల అమ్మకాల జోరు మాత్రం తగ్గలేదని, వీటి రిజిస్ట్రేషన్లు 28 % పెరగడం విశేషమని తెలిపింది.
వెయ్యి అడుగుల ఫ్లాట్లే ఎక్కువ ...
సెప్టెంబర్ 2022 లో రిజిస్టరయిన ప్రాపర్టీలలో 81 శాతం వాటా వెయ్యి అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్లదేనని ఈ రిపోర్టు పేర్కొంది. మొత్తం అమ్మకాలలో 1000–2000 చదరపు అడుగుల ఇండ్ల అమ్మకాల వాటా సెప్టెంబర్ 2022లో 71 శాతమని తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే పెద్ద వాటాను మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా దక్కించుకుంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 43 % ఈ జిల్లాలోనే జరిగాయి. ఆ తర్వాత 41 % రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా రెండో ప్లేస్లో నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో 15 % రిజిస్ట్రేషన్లు జరిగాయి. వెయిటెడ్ ఏవరేజ్ ప్రాతిపదికన ధరలను చూస్తే ఏడాది కిందటితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 15% పెరుగుదల కనిపిస్తున్నట్లు పేర్కొంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలో రేట్లు అత్యధికంగా 21 % పెరిగినట్లు రిపోర్టు వెల్లడించింది.
కరోనా మహమ్మారి టైములోనూ పటిష్టంగా కనిపించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు ఈ ఏడాది తగ్గింది. రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హోమ్లోన్లపై వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాల వల్ల షార్ట్టర్మ్లో రియల్ ఎస్టేట్ జోరు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. కానీ, లాంగ్టర్మ్లో గ్రోత్కు ఢోకా ఉండదు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. ఎకానమీ గ్రోత్ కూడా మెరుగ్గా ఉంటోంది.
‑ శిశిర్ బైజాల్-, ఛైర్మన్,
నైట్ఫ్రాంక్ ఇండియా