న్యూఢిల్లీ: బొగ్గుకు డర్టీ ఫ్యూయల్గా పేరుంది. ఎందుకంటే మురికిగా ఉండే ఈ నల్లబంగారం కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. దాని వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. బొగ్గును కాల్చడం వల్ల పాదరసం వంటి హానికర రసాయనాలు వస్తాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాల వాడకాన్ని తగ్గించి సోలార్, విండ్, హైడ్రోజన్ వంటి గ్రీన్ ఎనర్జీ తయారీ పెంపు కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బొగ్గుకు డిమాండ్ మాత్రం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్లో యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కరెంటు కొరతకు కారణమైంది. దీంతో ఈ సంవత్సరం దీని వినియోగం రికార్డు స్థాయికి వెళ్లింది. ఇండియా ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున చవగ్గా దొరికే బొగ్గు వాడకాన్ని పెంచింది. 2030 నాటికి రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచాలన్నది ప్రభుత్వ టార్గెట్. నాన్-ఫాజిల్ ఫ్యూయెల్స్ నుంచి 50 శాతం ఇంధన అవసరాలను తీర్చాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, బొగ్గు వాడకం మాత్రం తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ సంవత్సరం బొగ్గు వినియోగం, ఉత్పత్తి పోకడలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారతదేశం బొగ్గు వినియోగం 2007 నుంచి 6 శాతం వార్షిక వృద్ధి రేటుతో రెట్టింపు అయ్యింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్లో అతిపెద్ద పెరుగుదల భారతదేశం (అదనంగా 7 శాతం లేదా 70 మిలియన్ టన్నులు) నుంచే ఉంది.
మనదేశంలో క్లీన్ ఫ్యూయల్స్ ఉత్పత్తి తగినంతంగా లేకపోవడం, కరెంటుకు డిమాండ్ పెరిగి పోతుండటంతోపాటు ఇది చవక కావడంతో బొగ్గుకు ఇక నుంచి కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుందని నిపుణులు చెబుతు న్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని ఒక బిలియన్ టన్నులకు పెంచాలని బొగ్గు మంత్రి త్వ శాఖ ప్రయత్నిస్తోంది. రాబోయే 2023లో అత్యధిక ఉత్పత్తి సాధించాలని కంపెనీలకు స్పష్టం చేసింది.
భారీగా పెరగనున్న డిమాండ్
గ్రిడ్లకు అనుసంధానించిన 404 గిగావాట్ల మొత్తం స్థాపిత సామర్థ్యంలో బొగ్గు ఆధారిత కరెంటు ప్లాంట్ల వాటా 50 శాతం ఉంది. ప్రస్తుతం మరో 25 గిగావాట్ల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. 2025లో భారతదేశ బొగ్గు డిమాండ్ క్రమంగా 1,220 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇందులో 92 శాతం కరెంటు ఉత్పత్తికి వెళుతుంది. కరెంటు డిమాండ్ కూడా ఏటా ఏడు 7 శాతం పెరుగుతోంది. దిగుమతులను తగ్గించుకోవడంతోపాటు వేసవిలో కరెంటు సమస్యను నివారించడానికి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్రం కంపెనీలను ఒత్తిడి చేస్తోంది. 2021లో బొగ్గు ఉత్పత్తి మొదటిసారిగా 800 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2025 నాటికి బిలియన్ టన్నులను అధిగమిస్తుందని అంచనా. అయినప్పటికీ, 2030 నాటికి దాని పవర్ మిక్స్లో 50 శాతం క్లీన్ ఎనర్జీ ఉండాలన్నది కేంద్రం టార్గెట్. బొగ్గుపై కరెంటు రంగం ఆధారపడటాన్ని తగ్గించడానికి, పవర్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో మొత్తం 58 టెరావాట్-గంటల (టీడబ్ల్యూహెచ్) కరెంటు ఉత్పత్తిని తగ్గించాలని 81 బొగ్గు ఆధారిత కరెంటు ప్లాంట్లను ఆదేశించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని ఒక బిలియన్ టన్నులకు పెంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖ యోచిస్తోంది రాబోయే 2023లో అత్యధిక ఉత్పత్తి సాధించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్యంలోని సిఐఎల్, వాణిజ్య గనులు, క్యాప్టివ్ కోల్ బ్లాక్లతో కూడిన వివిధ వనరుల నుంచి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వస్తుందని చెప్పారు. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికి పైగా కోల్ ఇండియా (సీఐఎల్) వాటాయే ఉందని ఆయన అన్నారు.