- 36 ఏండ్ల కింద అమ్మిన 8 ఎకరాల భూమి తమదంటూ వచ్చిన వారసులు
- సాదాబైనామాలకు పట్టాలియ్యకుండా పెండింగ్ పెట్టిన సర్కారు
- ధరణి వల్ల అమ్మినోళ్ల పేరిటే పట్టా
- రైతులపై రియల్టర్లతో కలిసి వారసుల దాడి
- మనస్తాపంతో పురుగుల మందు తాగిన తండ్రీ కొడుకులు
- ఆదిలాబాద్ జిల్లా కజ్జర్ల గ్రామంలో ఘటన
ఆదిలాబాద్/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్.. ఓ రైతు కుటుంబంలోని తండ్రీకొడుకుల ప్రాణాల మీదికి తెచ్చింది. 36 ఏండ్ల కింద కొని సాగుచేసుకుంటున్న భూమికి తమపేరుతో కాకుండా అప్పట్లో అమ్మిన వ్యక్తి పేరుతోనే కొత్త పట్టాలు వచ్చాయి. తమ దగ్గర ఉన్న సాదాబైనామాను చూపి, పట్టాబుక్ను తమ పేరుపై మార్చాలని రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు.
ఈలోగా అప్పట్లో భూమి అమ్మిన వ్యక్తి వారసులు వచ్చి ఆ భూమి తమదని, పొలం నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. వినకపోవడంతో ఆదివారం కొందరు రియల్టర్లతో కలిసి వచ్చి రైతు కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకులు పురుగుల మందు తాగారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనలో యాళ్ల జైపాల్రెడ్డి, ఆయన కొడుకు చరణ్ రెడ్డి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఇదీ నేపథ్యం..
జైపాల్రెడ్డి తండ్రి యాళ్ల రాజారెడ్డి 36 ఏళ్ల క్రితం మావల గ్రామానికి చెందిన అబ్దుల్ ఘనీ నుంచి 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు. అప్పట్లో పెద్దమనుషుల సమక్షంలో బాండ్ పేపర్ మీద రాయించుకున్నాడు. అప్పటి నుంచి భూమి సాగుచేసుకుంటున్నప్పటికీ నిరక్షరాస్యులు కావడంతో పట్టా చేయించుకోలేదు. మూడేండ్ల కింద రాజారెడ్డి చనిపోవడంతో భూమి పట్టా కోసం ఆయన కొడుకు జైపాల్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. సాదాబైనామా ఉన్నవాళ్లందరికీ పట్టాలిస్తామని సర్కారు హామీ ఇచ్చినా నెరవేరలేదు. రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఈలోగా ధరణి రావడంతో అంతకుముందు ఎలాంటి పట్టా లేని అబ్దుల్ఘనీ పేరిట కొత్త పట్టా పాస్బుక్ వచ్చింది. దీంతో ఆ భూమి తమదేనని, ఖాళీ చేసి తమకు అప్పగించాలని ఘనీ కొడుకులు టీఆర్ఎస్ నేత ఆసిఫ్, యూసుఫ్లు.. జైపాల్రెడ్డి, ఆయన కొడుకు చరణ్రెడ్డిని బెదిరించారు. పొలంలోకి అడుగు పెట్టవద్దంటూ దౌర్జన్యం చేశారు. ఎప్పట్లాగే ఆదివారం ఉదయం జైపాల్ రెడ్డి, ఆయన భార్య వెంకటమ్మ, చరణ్ రెడ్డి పొలానికి వెళ్లారు. అయితే, ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఆసిఫ్, యూసుఫ్లు.. అనుచరులు, రియల్ మాఫియాతో కలిసి వచ్చి అన్నం తింటున్న జైపాల్రెడ్డి కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన జైపాల్రెడ్డి, చరణ్ రెడ్డి అక్కడే పురుగుల మందు తాగారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వారిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదు గంటలు రాస్తారోకో
దాడి గురించి తెలుసుకున్న కజ్జర్ల గ్రామస్తులు.. రిమ్స్కు పెద్ద సంఖ్యలో వచ్చారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యులతో కలిసి రిమ్స్ ఎదుట నేషనల్ హైవేపై బైఠాయించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 దాకా రాస్తారోకో చేశారు. ఆసిఫ్ టీఆర్ఎస్కు చెందినవాడు కావడం వల్లే రెవెన్యూ అధికారులు నిందితుడికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రియల్ఎస్టేట్ మాఫియాతో కలిసి జైపాల్రెడ్డి, పెదేల్లి స్వామి అనే వ్యక్తుల భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారని బాధితులు వాపోయారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ను మళ్లించారు. ఘటనపై విచారణ చేయిస్తామని, బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ నటరాజన్హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, దాడి ఘటనపై వెంకటమ్మ పోలీసులకు
ఫిర్యాదు చేసింది.
అన్నం తింటుండంగా దాడి
పొలంలో చెట్టు కింద అన్నం తింటుండగా 20 మంది ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. ఆ బాధతో మా ఆయన, కొడుకు పురుగుల మందు తాగారు. 36 ఏళ్ల కిందట్నే అబ్దుల్ ఘనీ దగ్గర మా మామ భూమి కొన్నడు. మా భూమిని వాళ్లు దౌర్జన్యంగా పట్టా చేసుకున్నరు. ఆ పట్టాలను రద్దు చేసి వాళ్లను అరెస్ట్ చేయాలె. మా పొలానికి పక్కన ఉన్న వ్యక్తి భూమినీ కబ్జా చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న, అధికారుల వద్దకు వెళ్లినా మాకు న్యాయం జరగలేదు.
- యాళ్ల వెంకటమ్మ, జైపాల్ రెడ్డి భార్య
మరిన్ని వార్తల కోసం...