
రాళ్లు కూలటంతో పాత బ్రిడ్జిని బంద్ చేసిన ఆఫీసర్స్
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి నుంచి నిజాంసాగర్ మండలం మీదుగా నాందేడ్ హైవేతోపాటు పిట్లం, మద్నూర్, జుక్కల్, సంగారెడ్డి వైపు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నేషనల్ హైవేతో స్టేట్ హైవేను కనెక్ట్ చేసే ఈ మార్గంలో నిజాంసాగర్ మండలకేంద్రంలో దశాబ్దాల కింద నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. వాహనాల రాకపోకలతో బ్రిడ్జి రాళ్లు పడిపోయాయి. భారీవాహనాలు ప్రయాణం సాగిస్తే మరింత ఒత్తిడికి గురై బ్రిడ్జి పడిపోయే ప్రమాదముందని భావించిన ఆఫీసర్లు రాకపోకలు బంద్చేశారు.
రూ.25కోట్లతో కొత్త బ్రిడ్జి
పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ఐదేండ్ల కింద కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు పనులు షురూ చేశారు. రూ.25కోట్లతో స్టార్ట్ చేసిన నిర్మాణం ఇటీవల కంప్లీట్అయింది. నిర్మాణ పనులు కంప్లీట్ అయినప్పటికీ బ్రిడ్జిపై రోడ్డు, అప్రోచ్ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాత బ్రిడ్జిని బంద్చేయడంతో కొత్త దానిపై నుంచి వాహనాలను అనుమతించాల్సిన పరిస్థితి. బ్రిడ్జిపై అప్రోచ్రోడ్డుపై బీటీ వేయకపోవడంతో కంకర రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గుంతలు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు.