న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లు లేవంటూ కొన్ని రాష్ట్రాల్లోని టీకా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఆన్లైన్లో వ్యాక్సిన్ కోసం బుక్చేసుకుని వచ్చిన వాళ్లనూ తిప్పి పంపించేస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్తో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు భారీగా ముందుకు రావడంతో.. కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్కు తగ్గట్టు వ్యాక్సిన్ ప్రొడక్షన్ను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అయితే, ప్రొడక్షన్ను పెంచినా డిమాండ్కు తగ్గ సరఫరాను అందుకోవాలంటే మాత్రం మరికొన్ని వారాలు పట్టే అవకాశమున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
5 కోట్ల డోసులను పంపిస్తున్న కేంద్రం
వాటితో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ ట్రయల్స్కు ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. బయోలాజికల్–ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్, జైడస్ క్యాడిలా జైకొవ్డీలపై ట్రయల్స్ నడుస్తున్నాయి. వాటి వాడకానికీ ఆమోదం లభిస్తే దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతమున్న అవసరానికి తగ్గట్టు వివిధ రాష్ట్రాలకు 5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఆ వ్యాక్సిన్లు దాదాపు రెండు వారాల పాటు సరిపోతాయని చెప్పారు.
కొవాగ్జిన్.. 70 కోట్ల డోసులు
భారత్ బయోటెక్ కూడా ప్రొడక్షన్ను రెండింతలు చేయనుంది. ప్రస్తుతం రోజూ 2 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ.. వచ్చే నెల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెలలో బెంగళూరులోని కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు భారీ బయోరియాక్టర్ వస్తుందని, దీంతో ప్రొడక్షన్ను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి 20 కోట్ల డోసులను తయారు చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్లతో ఏటా 70 కోట్ల డోసులను తయారు చేసేలా ఈ డిసెంబర్ నాటికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అదనంగా 50 కోట్ల డోసులను పెంచుతామన్నారు. కాగా, జులై–ఆగస్టు నాటికి 15 కోట్ల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ చైర్మన్ కృష్ణ ఎల్లా ఇదివరకే ప్రకటించారు.
కొవిషీల్డ్.. ఆగస్టు నాటికి 47 కోట్ల డోసులు
ప్రస్తుతం దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం సీరమ్ నెలకు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు డోసులను తయారు చేస్తోంది. వచ్చే నెల నుంచి దానిని 10 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. నిజానికి గత జనవరి నుంచే ప్రొడక్షన్ను 10 కోట్ల డోసులకు పెంచాల్సి ఉన్నా.. ముడిసరుకు కొరతతో అది సాధ్యపడలేదని ఆ కంపెనీ సీఈవో ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ టార్గెట్ కాస్తా మే నెలకు మారింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్లను బట్టి ఆగస్టు నాటికి 47 కోట్ల డోసులను తయారు చేసేందుకు ప్లాన్లను సిద్ధం చేసి పెట్టుకుంది.
స్పుత్నిక్.. 87.5 కోట్లు
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్Vని తయారు చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్తో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్ఎఫ్ఐడీ) ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులివ్వాల్సిందిగా కేంద్రానికీ కంపెనీ అర్జీ పెట్టుకుంది. అయితే, మన దేశంలో మొత్తంగా 87.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేలా ఆర్ఎఫ్ఐడీ ఒప్పందాలు చేసుకుంది. హెటిరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్, పనాసీ బయోటెక్, స్టెలిస్ బయోఫార్మాలతోనూ జట్టు కట్టింది. ఉత్పత్తి అయిన డోసుల్లో 42.6 కోట్ల డోసులను దేశంలో వాడుకునేందుకు వీలుగా ఒప్పందం చేసుకుంది.
టీకా వేసుకున్నోళ్లకు డిజిటల్ సర్టిఫికెట్
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే ‘డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్’ను ఇచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్వో.. ఫాస్ట్ హెల్త్కేర్ ఇంటర్ఆపరబిలిటీ రీసోర్సెస్ (ఎఫ్హెచ్ఐఆర్)ను ఏర్పాటు చేయడంపై కసరత్తులు చేస్తోందని, అది ఖరారయ్యాకు దాని ప్రమాణాలకు తగ్గట్టే కేంద్ర ప్రభుత్వమూ డిజిటల్ సర్టిఫికెట్ ఇస్తుందని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్లో సభ్యుడైన రామ్ సేవక్ శర్మ చెప్పారు. ఆ సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటవుతుందన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా ఎందుకు సోకుతోంది?
వ్యాక్సిన్ తీసుకున్నా చాలా మందికి కరోనా సోకుతోంది. మన దేశంలోనే కాదు.. అమెరికా వంటి బయటి దేశాల్లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. వీటినే ‘బ్రేక్ త్రూ కేసెస్’ అంటున్నారు. దానికి మొదటి కారణం వ్యాక్సిన్ను సరిగా వేయకపోవడమేని నిపుణులు చెబుతున్నారు. భుజంపై సరైన చోట టీకాను వేయకపోతే దాని పనితీరు మందగిస్తుందని అంటున్నారు. నిర్ణయించిన టెంపరేచర్లలో వ్యాక్సిన్ను నిల్వ చేయకపోయినా పనితీరు తగ్గిపోతుందని, ఫలితంగా వైరస్ సోకుతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తిలో ఇమ్యూన్సిస్టమ్ స్పందన సరిగ్గా లేకున్నానా వైరస్ సోకే అవకాశం ఉందంటున్నారు. వయసు మళ్లడం, ఎక్కువ కాలం పాటు మందులు వాడటం, వేరే జబ్బులకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటం, జెనెటిక్ సమస్యలుండటం వంటి కారణాల వల్ల ఇమ్యూన్ సిస్టమ్ స్పందన తగ్గొచ్చని చెబుతున్నారు.
పేద దేశాలకు సెకండ్ డోస్ అందట్లె
డబ్బున్న దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేగంగానే జరుగుతున్నా.. పేద దేశాలు మాత్రం వెనుకబడిపోతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ మొదలైనా.. కొన్ని పేదదేశాలకు సెకండ్ డోస్ అందని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 60 దేశాలు కేవలం ఫస్ట్ డోస్ వద్దే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేద దేశాలకూ వ్యాక్సిన్ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్వో ఏర్పాటు చేసిన ‘కొవాక్స్’ గ్రూప్.. సోమవారం నుంచి ఆయా దేశాలకు వ్యాక్సిన్లను పంపలేదు. ఇప్పటిదాకా పంపించిన వాటిలోనూ అత్యధికంగా ఒక్కరోజులో 25 వేల వ్యాక్సిన్లనే ఒక్కో పేద దేశానికి పంపించింది. యునిసెఫ్ లెక్కల ప్రకారం గడిచిన రెండు వారాల్లో 92 దేశాలకు కేవలం 20 లక్షల డోసులనే కొవాక్స్ పంపించింది. డబ్బున్న దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. పేద దేశాల్లో 500 మందిలో ఒకరికే టీకా అందిందని డబ్ల్యూహెచ్వో చెప్పింది.