న్యూఢిల్లీ: బాణసంచా పరిశ్రమ ఈ సంవత్సరం మస్తు ఖుషీగా ఉంది. దసరా, దీపావళి సందర్భంగా టపాసుల అమ్మకాలు విపరీతంగా పుంజుకున్నాయి. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా రూ. ఆరు వేల కోట్ల విలువైన పటాకులు అమ్ముడయ్యాయి. ధరలు పెరిగినప్పటికీ, మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా మూగబోయిన అమ్మకాలు పుంజుకున్నాయి. కరోనా ఎఫెక్ట్ దాదాపు ఏమీ లేకపోవడంతో ఈ ఏడాది బాణసంచా అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి. ఇవి 2016 –2019 మధ్య బిజినెస్ ట్రెండ్ల మాదిరిగానే ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్టులు చెబుతున్నారు.
తమిళనాడు బాణసంచా, ఆయుధాల తయారీదారుల సంఘం (టీఏఎన్ఎఫ్ఏఎంఏ) ప్రెసిడెంట్ గణేశన్ పంజురాజన్ మాట్లాడుతూ, "ప్రస్తుతం సంవత్సరం లో రూ.6,000 కోట్ల రిటైల్ టర్నోవర్ సాధించాం. ఇవి కేవలం అంచనాలే మాత్రమే. ధరల పెరుగుదల వల్ల ఈ మొత్తం కొంత ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. పూర్తి వివరాలు రావడానికి కొంత సమయం పడుతుంది. 2016– 2019 మధ్య, ప్రతి సంవత్సరం అమ్మకాల విలువ సుమారు రూ.4,000– రూ.5,000 కోట్ల మధ్య ఉంది”అని ఆయన వివరించారు. అయితే 2020, 2021 సంవత్సరాలలో మొత్తం రిటైల్ అమ్మకాలు మునుపటి సంవత్సరాల సగటు కంటే తక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది తమలో ఎవరి దగ్గరా ఇన్వెంటరీ (అమ్ముడుపోని స్టాక్) లేదని గణేశన్ అన్నారు.