
గుజరాత్కు చెందిన ఓ డాక్టర్ మార్చి 15 నుండి జూన్ 25 వరకు అంటే మూడు నెలల్లో రూ.19.25 కోట్లు పోగొట్టుకుంది. గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన మహిళా డాక్టర్ దేశంలోనే అత్యంత షాకింగ్ సైబర్ మోసాలలో ఒకదానికి బలైంది, దింతో కేవలం మూడు నెలల్లో రూ.19 కోట్లు కోల్పోయింది. దీనిని ఒక పెద్ద 'డిజిటల్ అరెస్ట్' స్కామ్ అని కూడా చేబుతున్నారు.
వివరాలు చూస్తే మార్చి 15న డాక్టర్ మొబైల్ ఫోన్లో అభ్యంతరకరమైన కంటెంట్ గుర్తించినట్లు ఎవరో ఫోన్ కాల్ చేయడంతో ఈ సమస్య మొత్తం మొదలైంది. ఫోన్ కాల్లో ఇన్వెస్టిగేషన్ కి సహకరించకపోతే మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తానని మొదట బెదిరించారు. తర్వాత సబ్-ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా పై అధికారులు అంటూ నటిస్తూ ఆమెకి భయాన్ని పుట్టించారు. ఇలా కొంతకాలం ఫేక్ కాల్స్ నడిచాయి.
మెల్లిమెల్లిగా మానసిక ఒత్తిడి, బెదిరింపులకి కుంగిపోయిన ఆ డాక్టరుతో దాచుకున్న 19 కోట్లను 35 వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించారు. చివరికి ఆమె బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకున్నారు, ఆ డబ్బు కూడా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పటికప్పుడు బెదిరింపుల వల్ల డాక్టర్ ఎక్కడికి వెళ్లిన వీడియో కాల్స్ ద్వారా చెప్పుకోవాల్సి వచ్చేది, ఇంకా ఆమె ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టినప్పుడల్లా ఎక్కడికి వెళ్తుందో లొకేషన్ షేర్ చేయాల్సి వచ్చేది.
తర్వాత, ఓ రోజు ఎటువంటి బెదిరింపులు లేకుండా కాల్స్ ఆగిపోయాయి. దింతో ఏదో తప్పు జరిగిందని ఉహించిన ఆమె వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చింది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జూలై 16న అందిన ఫిర్యాదు మేరకు గుజరాత్ CID సైబర్ క్రైమ్ యూనిట్ ఈ కేసును దర్యాప్తు ప్రారంభించింది. ఒకే వ్యక్తి నుండి ఇంత డబ్బు ఇలా కొట్టేయడం భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ మోసం కేసుల్లో ఒకటి కావచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
►ALSO READ | బ్యాంకుల్లో మూలుగుతున్న 67 వేల కోట్ల జనం డబ్బు : ఎవరూ క్లెయిమ్ కూడా చేయటం లేదంట..!
దర్యాప్తు తర్వాత సూరత్లో ఒక అనుమానితుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు, అతని కొట్టేసిన డబ్బులో రూ. 1 కోటి మాత్రమే రికవరీ అయ్యాయి. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న నెట్వర్క్ ని గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు, ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.
కొట్టేసిన డబ్బులో కొంత మాత్రమే దొరికినప్పటికీ పెద్ద మొత్తం ఎవరి దగ్గర ఉందొ బయటపడలేదు. ఈ మోసం కేసులో అసలు సూత్రధారుల కోసం గాలింపులు చేస్తున్నారు.