- భారీగా వెచ్చిస్తున్న దేశీయ ఓటీటీలు
- అన్ని మీడియాల్లో మస్తు యాడ్స్
న్యూఢిల్లీ: హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్వంటి పెద్ద సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి, చందాదారుల సంఖ్యను పెంచుకోవడానికి దేశీయ/లోకల్ ఓటీటీ ప్లాట్ఫారమ్స్ డబ్బులు గుమ్మరిస్తున్నాయి. మార్కెటింగ్, ప్రమోషన్కు కేటాయిస్తున్న నిధులను భారీగా పెంచుతున్నాయి. మీడియా ప్రకటనలు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కోసం ఒక్కో సంస్థ రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఆహా వీడియో (తెలుగు), హోయిచోయ్ (బెంగాలీ,) ప్లానెట్ మరాఠీ వంటి ప్లాట్ఫారమ్లు షోలు, సినిమాల ప్రచారం కోసం హై-ప్రొఫైల్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో జనాన్ని ఆకట్టుకోగలిగిన వారితో (ఇన్ఫ్లూయెన్సర్లు)తో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
టెలివిజన్, న్యూస్పేపర్లలో యాడ్స్ఇస్తున్నాయి. మరికొన్నేమో ఓటీటీలు టెలికాం, బ్రాడ్బ్యాండ్ కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. పేటీఎం, ఫోన్పే వంటి వాలెట్ల ద్వారా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. నాన్-మెట్రో సిటీల జనాన్ని ఆకట్టుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయి. “అంతర్జాతీయ ఓటీటీ కంపెనీలకు మార్కెటింగ్ ఖర్చులు మా కంటే చాలా ఎక్కువే అయినప్పటికీ మా ప్రేక్షకుల వినోద అవసరాలను అవి తీర్చలేవు. ఎందుకంటే మా కంటెంట్ వేరుగా ఉంటుంది. మేం స్థానిక భాషలో సినిమాలు, షోలతో అలరిస్తాం”అని హోయ్చోయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సౌమ్య ముఖర్జీ తెలిపారు.
స్థానిక భాషలవైపే మొగ్గు
డిజిటల్ ఏజెన్సీ వైట్ రివర్స్ మీడియా కో–ఫౌండర్ మితేష్ కొఠారి మాట్లాడుతూ భారత్లో ఇంటర్నెట్ను వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతోందని చెప్పారు. వారిలో దాదాపు 90 శాతం మంది తమ స్థానిక భాషలో కంటెంట్ను చూడటానికి ఇష్టపడుతున్నారని అన్నారు. ప్రాంతీయ ప్లాట్ఫారమ్లకు చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. బెంగాలీ సంస్కృతిపై అవగాహన ఉన్న ఇన్ఫ్లూయర్లను తమ మార్కెటింగ్ కోసం హోయిచోయ్ వాడుకుంటోంది. “దేశవ్యాప్తంగా, ముఖ్యంగా టైర్- 2, టైర్- 3 నగరాల్లో ప్రచారం చేయడంలో ప్రింట్, ఆన్లైన్ మీడియాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవుట్డోర్ మార్కెటింగ్ను మేం పెద్దగా వాడం. పెద్ద సినిమాలు లేదా దుర్గాపూజ వంటి సమయాల్లో మాత్రమే అవుట్డోర్ ప్రచారం చేస్తాం" అని ముఖర్జీ అన్నారు. తెలుగు ఓటీటీ ఆహా మొదటి నుంచీ బ్రాండ్ మార్కెటింగ్ కోసం గణనీయంగా ఖర్చు చేసిందని అర్హ మీడియా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ కనుమూరు తెలిపారు.
కొత్త ప్రాజెక్ట్లను ప్రకటించడానికి ప్రత్యేక ఈవెంట్లను నిర్వహిస్తున్నామని అన్నారు. “ పెద్ద సినిమా విడుదల గురించి టీవీ, ప్రింట్, అవుట్డోర్ మీడియంల ద్వారా ప్రచారం చేస్తాం. కొన్నింటికి డిజిటల్ మార్కెటింగ్ సరిపోతుంది. స్థానిక ఓటీటీలకు తమ ప్రకటనల ప్రభావం ఎలా ఉందో త్వరగా తెలుస్తుంది. తదనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకోవచ్చు" అని కనుమూరు చెప్పారు. రైళ్లు, విమానాశ్రయాలలో కూడా ప్రకటనలు ఇచ్చే ప్లానెట్ మరాఠీ ఫౌండర్అక్షయ్ బర్దాపుర్కర్ మాట్లాడుతూ ఇప్పుడు మార్కెటింగ్ ఖర్చు మొత్తం బడ్జెట్లో 50 శాతం వరకు ఉంటోందని వివరించారు. ప్రాంతీయ భాషా స్ట్రీమింగ్ సర్వీసుల ప్రమోషన్ బడ్జెట్లు విదేశీ ఓటీటీలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అయితే మార్కెటింగ్ వ్యూహాలు మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయని పంజాబీ సర్వీస్ చౌపాల్కు చెందిన మహేష్ శర్మ అన్నారు.
సోషల్ మీడియా కూడా ముఖ్యమే
ఓటీటీ సర్వీస్ ‘ఎపిక్ ఆన్’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సౌర్జ్య మొహంతి మాట్లాడుతూ, తమ సంస్థ సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పారు. ‘‘మా షోలను చిన్నారులతో, కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చని తెలియజేస్తాం. ప్లాన్ల వివరాలను ప్రకటిస్తాం. నెలవారీ ప్లాన్ ప్యాకేజీలను అమ్మడానికి ప్రపంచవ్యాప్తంగా 25-–30 టెలికాం ఆపరేటర్లతో చేతులు కలిపాం”అని వివరించారు. కొన్ని లోకల్ఓటీటీలు స్థానిక జిమ్లలో కూడా ప్రకటనలు ఇస్తాయని జూ మీడియా యాజమాన్యంలోని వీడియో కంటెంట్ సొల్యూషన్స్ ఏజెన్సీ ‘ది రాబిట్ హోల్’ బిజినెస్ హెడ్ రిషబ్ ఖట్టర్ చెప్పారు. నోటీసు బోర్డులు, సొసైటీ వాట్సాప్ గ్రూపులు, మైక్రో అంబాసిడర్లు, బండిల్డ్ ఫ్లయర్ల ద్వారా ప్రచారం చేస్తామని, ఇందుకు హౌసింగ్ సొసైటీలతో ఒప్పందం కుదుర్చుకుంటామని ఖట్టర్ చెప్పారు.
“ప్రాంతీయ ఓటీటీలు ప్రచార కార్యక్రమాలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తాయి. విదేశీ ఓటీటీల ప్రచారం దేశమంతటా ఉంటుంది. కంటెంట్ను ప్రారం భించే ముందు మేం కాలేజీల్లో, మాల్స్లో ప్రచారం చేస్తాం. ప్రింట్, డిజిటల్ మీడియాను కూడా వాడు కుంటాం. రాష్ట్రంలోని వివిధ నగ రాల్లో జరిగే మాస్ ఈవెంట్ల ద్వారా లోకల్ ఆడియన్స్కు దగ్గర అవుతాం’’ అని చౌపాల్కు చెందిన శర్మ చెప్పారు.