- ఎలక్టోరల్ ట్రస్ట్ల నుంచే ఎక్కువ చందాలు
- బీజేపీకి వచ్చిన నిధుల్లో 94 శాతం బడా కంపెనీల నుంచే
- కాంగ్రెస్కు రూ.68.56 కోట్లు.. అందులో కార్పొరేట్ల వాటా 81%
- ఏడీఆర్ రిపోర్టులో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
న్యూఢిల్లీ: బడా కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార సంస్థల నుంచి డొనేషన్లు పొందడంలో బీజేపీ.. మిగతా పార్టీలు అందుకోలేనంత ఎత్తుకెళ్లింది. 2016 నుంచి 2018 దాకా(రెండు ఫైనాన్షియల్ ఇయర్స్లో) పార్టీలకు రూ.20వేలకు మించి స్వచ్ఛంద విరాళంగా లభించిన నిధులపై ప్రఖ్యాత అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్స్మ్(ఏడీఆర్) మంగళవారం ఒక రిపోర్టు విడుదల చేసింది. గత రెండేండ్లలో దేశంలోని ఆరు నేషనల్ పార్టీలకు మొత్తం రూ.1059.25కోట్ల డొనేషన్లొస్తే, అందులో రూ.985.18 కోట్లు అంటే 93 శాతం నిధులు ఎలక్టోరల్ ట్రస్ట్ల నుంచే వచ్చాయి. ఎన్నికల నిధుల సేకరణకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) వద్ద ఇప్పటికే21 రిజిస్టర్డ్ ట్రస్టులున్నాయి.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎలక్టోరల్ ట్రస్ట్లు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించే ఎలక్టోరల్ ట్రస్టులు.. ఆ డబ్బును నేరుగా పార్టీల ఖాతాలకు తరలిస్తాయి. గత రెండేండ్లలో బీజేపీకి రూ.969.31 కోట్ల చందాలు రాగా, అందులో 94 శాతం(రూ.915.59కోట్లు) వాటా ఎలక్టోరల్ ట్రస్ట్దే. సంఖ్యాపరంగా మొత్తం 1731 సంస్థలు లేదా వ్యక్తుల నుంచి బీజేపీకి విరాళాలొచ్చాయి. నిధుల సేకరణలో బీజేపీ తర్వాతి స్థానం కాంగ్రెస్ పార్టీదే అయినా, అమౌంట్ పరంగా రెండు పార్టీ మధ్య చాలా గ్యాప్ ఉంది. గత రెండేండ్లలో కార్పొరేట్ సెక్టార్ నుంచి బీజేపీకి రూ.915.59 కోట్ల డొనేషన్లొస్తే, కాంగ్రెస్కు కేవలం రూ.55.36 కోట్లే దక్కాయి. హస్తం పార్టీకొచ్చిన మొత్తం చందా (రూ.68.56 కోట్ల)లో 81 శాతం వాటా ఎలక్టోరల్ ట్రస్ట్లదే. నంబర్ ఆఫ్ డొనేషన్స్151గా ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి 2016–18లో మొత్తం రూ.8.43 కోట్ల చందాలొస్తే అందులో రూ.7.73 కోట్లు(92 శాతం) కార్పొరేట్ కంపెనీలు ఇచ్చినవే.
జాతీయ పార్టీల్లో కార్పొరేట్ల నుంచి అతి తక్కువ చందాలు తీసుకున్నది సీపీఐ ఒక్కటే. గత రెండేండ్లలో సీపీఐకి రూ.2.59 కోట్ల డొనేషన్లురాగా, అందులో మెజారిటీ వాటా యూనియన్ల చందాలే. ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చినవి కేవలం 2 శాతమే. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన మొత్తం డొనేషన్( రూ.2.35 కోట్ల)లో 86 శాతం వాటా బడా కంపెనీలదే. సీపీఐకి రూ.8.01కోట్లొస్తే, అందులో సగం కార్పొరేట్లు చదివించుకున్నదే. మరో జాతీయ పార్టీ బీఎస్పీ మాత్రం గత రెండేండ్లలో తమకు రూ.20వేలకు మించి డొనేషన్లు రాలేదని చెప్పింది.
ఎలక్టోరల్ ట్రస్టుల్లో అదేటాప్
సీబీడీటీ గుర్తింపు పొందిన 21 ఎలక్టోరల్ ట్రస్టుల్లో ప్రుడెంట్సత్య ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే పార్టీలకు ఎక్కువ మొత్తంలో డొనేషన్లు అందాయి. మొత్తం కార్పొరేట్ చదివింపుల్లో దీని వాటా 94 శాతంగా ఉంది. ప్రుడెంట్ సత్య ట్రస్ట్ నుంచి బీజేపీకి రూ.405.52కోట్ల విలువ చేసే 33 డొనేషన్లు, కాంగ్రెస్ పార్టీకి రూ.23.9కోట్ల విలువచేసే 13 డొనేషన్లు వెళ్లాయి. భద్రమ్ జనహిత్ శలీకా ట్రస్ట్ నుంచి రూ.41కోట్లు, జనతా నిర్వాచక్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.25 కోట్లు, మరో నాలుగు ట్రస్ట్ల నుంచి సుమారు రూ.50 కోట్లు ఆయా పార్టీలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి.
డొనేషన్లలో ఢిల్లీదే జోరు
ఎలక్టోరల్ ట్రస్టు లు, ఇతర రంగాలు, పర్సనల్ డొనేషన్ల రూపంలో పార్టీలకు చేరుతున్న నిధుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ నుంచే వస్తుండటం గమనార్హం. గత రెండేండ్లలో ఆరు జాతీయ పార్టీలకు .1059.25కోట్ల డొనేషన్లొస్తే అందులో ఢిల్లీ వాటా రూ.481.37 కోట్లని ఏడీఆర్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ
తర్వాతి స్థా నాల్లో మహారాష్ ట్ర(రూ.176.88 కోట్లు ), కర్నాటక(రూ.43.18కోట్లు ), గుజరాత్
( రూ.41.97కోట్లు ) ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేషనల్ పార్టీలకు రూ.6.64కోట్ల చందాలు వెళ్లాయి. పార్టీలకు అందిన మొత్తం చందాలో రూ.120.14కోట్ల విలువచేసే 916 డొనేషన్లకు అడ్రస్ లేదు. మరో 2.59కోట్లు విలువచేసే 76 డొనేషన్లకు పాన్ కార్డు వివరాలు లేవు.