571 కోట్ల నుంచి డబుల్
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ నికర లాభం జూన్ 2022 క్వార్టర్లో 108 శాతం పెరిగి రూ. 1,188 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ. 571 కోట్లు. ఇక మార్చి 2022 క్వార్టర్తో పోల్చినా నికర లాభం భారీగా పెరిగింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో డాక్టర్ రెడ్డీస్ ఆదాయం కూడా 6 శాతం గ్రోత్తో రూ. 5,215 కోట్లయింది. అంతకు ముందు ఏడాది ఇది రూ. 4,919 కోట్లు. కాకపోతే మార్చి 2022 క్వార్టర్తో పోలిస్తే ఆదాయం 4 శాతం తగ్గింది. తాజా క్వార్టర్లో ఇబిటా మార్జిన్ 34.1 శాతానికి పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
పైప్లైన్లో కొత్త ప్రొడక్టులు
కీలక బిజినెస్లలో గ్రోత్ కోసం నిరంతరం కష్టపడుతున్నామని, ప్రొడక్టివిటీ పెంచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని రిజల్ట్స్ ఎనౌన్స్మెంట్ సందర్భంగా కో ఛైర్మన్ అండ్ ఎండీ జీ వీ ప్రసాద్ చెప్పారు. కొత్త ప్రొడక్టులు లాంచ్కు రెడీగా ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
గ్లోబల్ జెనిరిక్స్ 8 శాతం గ్రోత్
గ్లోబల్ జెనిరిక్స్ సెగ్మెంట్ రెవెన్యూ రూ. 4,430 కోట్లకు పెరిగింది. కొత్త ప్రొడక్టుల లాంఛ్ వల్లే ఈ రెవెన్యూలో 8 శాతం గ్రోత్ సాధ్యమైనట్లు కంపెనీ తెలిపింది. నార్త్ అమెరికా సేల్స్ 2 శాతం పెరిగి రూ. 1,780 కోట్లకు చేరాయని, యూరప్ అమ్మకాలు 4 శాతం గ్రోత్తో రూ. 410 కోట్లయ్యాయని పేర్కొంది. దేశీయ మార్కెట్ విక్రయాలు రూ. 1,330 కోట్లకు అంటే 26 శాతం ఎగిసినట్లు డాక్టర్ రెడ్డీస్ వివరించింది. ఎమర్జింగ్ మార్కెట్స్ రెవెన్యూ ఒక శాతం తగ్గి రూ. 900 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. రిజల్ట్స్ నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ షేరు గురువారం ఎన్ఎస్ఈలో రూ. 26 తగ్గి రూ. 4,260 వద్ద ముగిసింది. గత ఏడాది కాలానికి చూస్తే డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ షేరు విలువ 10 శాతం పతనమైంది. కిందటి నెల రోజులలోనే ఈ షేరు 3 శాతం పడింది.