రోజుకు 10 నుంచి 15 డెలివరీలు.. డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి  

రోజుకు 10 నుంచి 15 డెలివరీలు.. డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి  
  • ఎంసీహెచ్ లో 10 మందికి ఇద్దరే  గైనకాలజిస్టులు 
  • ఇద్దరే సీనియర్​ రెసిడెంట్ డాక్టర్లు 
  • రోజుకు పది నుంచి 15 డెలివరీలు 
  • డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి  
  • మెరుగైన వైద్యం అందక పేషెంట్లకు తిప్పలు  

మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్​హాస్పిటళ్లలో డెలివరీలు పెరగాలని, నార్మల్​ డెలివరీలే చేయాలని డాక్టర్లపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు సౌలత్​లు కల్పించడంలో ఫెయిల్ అవుతోంది.  మాతా శిశు ఆరోగ్య కేంద్రాల కోసం పెద్ద బిల్డింగులు కట్టినా సరిపడా డాక్టర్లు,  స్టాఫ్​ లేకపోవడంతో సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది.  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్​లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో డాక్లర్లు, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు.  ఫలితంగా మెరుగైన ట్రీట్​మెంట్​అందక గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఈ బాధలు పడలేక మరికొందరు ప్రైవేట్ దవాఖాన్లకు పోతున్నారు.  

అరకొర సేవలు...  తప్పని అవస్థలు

జిల్లాలోని పీహెచ్​సీలు, సీహెచ్​సీల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది.  చాలా చోట్ల గైనకాలిస్టులు లేరు. ఆపరేషన్​ థియేటర్లు లేవు.  దీంతో అతి కష్టంగా నార్మల్​ డెలివరీలతో సరిపెడుతున్నారు.  సర్జరీలు అవసరమైన కేసులను, సీరియస్​ కేసులను ఎంసీహెచ్​కు రెఫర్​ చేస్తున్నారు. దీంతో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలకు ఎంసీహెచ్​ఒకటే పెద్ద దిక్కుగా మారింది.  మహారాష్ర్టలోని సిరొంచ ప్రాంతం పేషెంట్లు కూడా రావడంతో రద్దీ పెరుగుతోంది. ఎంసీహెచ్​లో రోజుకు 10 నుంచి 15 డెలివరీలు జరుగుతుండగా, ఇందులో సగం సీ సెక్షన్లు,  ఔట్​ పేషెంట్​ (ఓపీ) కేసులు వందకు పైగా వస్తుండగా, ఇరవైకి పైగా ఇన్​ పేషెంట్లు  వస్తున్నారు.  సీనియర్​ రెసిడెంట్ల సహకారంతో ఒక్కో డాక్టర్​ 24 గంటలు డ్యూటీ చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది నార్మల్​డెలివరీ కోసం వేచి చూడకుండా సర్జరీలు చేయాలంటున్నారు.  మరి కొందరు ముహూర్తాలు చూసుకొని వచ్చి సిజేరియన్లు చేయాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది సరైన వైద్యం అందడం లేదంటూ డాక్టర్లతో, సిబ్బందితో  గొడవలకు దిగుతున్నారు. 

 పేషెంట్లకు రవాణా కష్టాలు 

ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఎంసీహెచ్​ను ఊరవతల గోదావరి ఒడ్డుకు నిర్మించడం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఎంసీహెచ్​ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రవాణా కష్టాలు తప్పడం లేదు. నిరుడు కొద్దిరోజులు ఆర్టీసీ బస్సును నడిపించి సరిపడా ఆదాయం రావడం లేదని బంద్​ చేశారు. దీంతో ఎంసీహెచ్​కు వెళ్లాలంటే ఆటోలే దిక్కయ్యాయి.  బస్టాండ్​ నుంచి ఒక్కొక్కరికి పగలు రూ.30,  నైట్​రూ.50 వసూలు చేస్తున్నారు. చుట్టుపక్కల హోటళ్లు, మెడికల్​ షాపులు లేకపోవడంతో ఎమర్జెన్సీగా టౌన్​కు రావాలన్నా కష్టమే.  నైట్​ఆటోలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.  డిగ్రీ కాలేజీ దాటితే అంతా నిర్మానుష్య ప్రాంతం.  రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా రావడానికి భయపడుతున్నారు. ఎంసీహెచ్​లోపల, బయట తగిన సెక్యూరిటీ లేకపోవడం వల్ల బిక్కుబిక్కమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఏడాదైనా తీరు మారలే...  

మంచిర్యాల గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన ఎంసీహెచ్​ను నిరుడు మే నెలలో హెల్త్ మినిస్టర్​ హరీశ్​రావు ఓపెన్​ చేశారు. అంతకుముందు జిల్లా హాస్పిటల్​లో కొనసాగుతున్న ఎంసీహెచ్​ను కొత్త బిల్డింగ్​లోకి షిఫ్ట్​ చేశారు. అప్పటినుంచి సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. నేటికి ఏడాది గడిచినా పరిస్థితిలో  మార్పులేదు.  గైనకాలజిస్టులు, ఇతర డాక్టర్లు కలుపుకొని 10 మందికి పైగా ఉండాలి.  కానీ ఇప్పుడు ఇద్దరు గైనకాలజిస్టులు మాత్రమే ఉన్నారు. ఐదుగురు సీనియర్​ రెసిడెంట్​డాక్టర్లకు గాను నలుగురికి కేటాయించారు.  వీరిలో ఇద్దరు లీవ్​లో వెళ్లగా, ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు.  అయినప్పటికీ ప్రభుత్వం డాక్టర్లను రిక్రూట్​మెంట్ చేయడం లేదు.  కాంట్రాక్ట్ డాక్టర్ల రిక్రూట్​మెంట్​కోసం ఏడాది కాలంలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా స్పందన కరువైంది. తాజాగా మళ్లీ నోటిఫికేషన్​ జారీ చేశారు. కాంట్రాక్ట్​ డాక్టర్లు ఎవరూ ఎంసీహెచ్​లో పనిచేయడానికి ఇంట్రెస్ట్​ చూపడం లేదు.  నర్సింగ్ స్టాఫ్​ సరిపడా ఉన్నప్పటికీ శానిటేషన్​, సెక్యూరిటీ, పేషెంట్​ కేర్​విభాగాల్లో కొరత ఉంది.