
- మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 80 వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకం
మెదక్/సంగారెడ్డి, వెలుగు: వర్షాలు పడక, ఎగువ నుంచి వరద నీరు రాక ప్రాజెక్టుల కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, మెదక్ జిల్లాలోని వనదుర్గాప్రాజెక్ట్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జూన్ ఆరంభంలో తొలకరి వర్షాలు కురియగానే కాలం కలిసి వస్తుందని భావించి దుక్కులు దున్ని నారుమళ్లు పోసుకున్న రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి సింగూర్ ప్రాజెక్టులోకి 20 టీఎంసీలకు పైగా నీరు చేరితే ఆయకట్టు పంటల సాగుకు నీరు విడుదల చేసే పరిస్థితి లేదు.
సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాలు..
సింగూర్ ప్రాజెక్టు కింద జిల్లాలో 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పుల్కల్ మండల పరిధిలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.210 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. 523.600 మీటర్లకు 521.288 మీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి. ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్, చౌటకూర్, అందోల్, మునిపల్లి మండలాల పరిధిలో కుడి, ఎడమ కాల్వల ద్వారా 50 వేల ఎకరాలు సాగవుతాయి. కెనాల్ సీసీ లైనింగ్ పనులు జరుగుతున్నందున గడిచిన యాసంగి సీజన్ లో అధికారులు క్రాప్ హలీడే ప్రకటించారు. ఈ వానకాలం సీజన్ లో పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
మెదక్ జిల్లాలో 30 వేల ఎకరాలు..
మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) కింద సెటిల్డ్ ఆయకట్టు 21,625 ఎకరాలు ఉండగా 30 వేల ఎకరాల వరకు సాగవుతుంది. తొలకరి వర్షాలు కురవగానే కొల్చారం, పాపన్న పేట, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో రైతులు దుక్కులు దున్ని నారుమళ్లు పోసుకున్నారు. సింగూరు ప్రాజెక్టు నీటిలో ఘనపూర్ ఆయకట్టు పంటల సాగు కోసం 4.6 టీఎంసీల వాటా ఉంది. అక్కడ తగినంత నీటి నిల్వ ఉంటేనే దిగువకు నీరు విడుదల చేయాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం వనదుర్గా ప్రాజెక్ట్ లో నీరు ఉన్నప్పటికీ ఆ నీటి ఆధారంగా నాట్లు వేస్తే తర్వాత సింగూరు నీరు విడుదల కాకుంటే ఇబ్బంది అవుతుందని రైతులు సాగుకు వెనుకాముందాడుతున్నారు.
వరుణుడిపైనే ఆశలు
సింగూరు, వనదుర్గా ప్రాజెక్ట్ ల కింద వానాకాలం పంటలు సాగు చేయాలంటే జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం, లేదా ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వరద నీరు సింగూరు ప్రాజెక్టులో 20 టీఎంసీలకు పైగా నీరు చేరాలి. అప్పుడే పంటల సాగు సాధ్యమవుతుంది.
తాగునీటి కోసమని..
సింగూర్ ప్రాజెక్టులో 16 టీఎంసీలకు మించి నీటి నిల్వ ఉంటేనే వనదుర్గా ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేయాలనే నిబంధనలున్నాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో ఆ మేర నీటి నిల్వ లేదు. ప్రస్తుతం 19 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా మిషన్ భగీరథ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులో 20 టీఎంసీలకు పైబడి ఉంటేనే వనదుర్గా ప్రాజెక్ట్ కు నీటి విడుదల సాధ్యమవుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ అయినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వానలు లేకపోవడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందంటున్నారు.