ఏడాదిగా 11 పీహెచ్​సీల్లో 50లోపే డెలివరీలు

ఏడాదిగా 11 పీహెచ్​సీల్లో 50లోపే డెలివరీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పీహెచ్​సీల్లో డాక్టర్ల కొరత, ఇతరత్రా కారణాలతో గర్భిణులు డెలివరీ కోసం పట్టణాల బాట పడుతున్నారు. పట్టణాల్లోని ప్రైవేట్​ హాస్పిటల్స్​తో పాటు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​ హాస్పిటల్​లో డెలివరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా జిల్లాలో మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలోని 11 పీహెచ్​సీల్లో ఏడాదిగా 50 లోపే డెలివరీలు చేయడం గమనార్హం. మరో రెండు పీహెచ్​సీసీలో ఏడాదిగా ఒక్క ప్రసవం కూడా చేయలేదు. పూర్తి ఏజెన్సీ ప్రాంతంలోనూ  డెలివరీ కోసం అప్పు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. 

పీహెచ్​సీల్లో టార్గెట్​ రీచ్​ కావట్లే..

జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.  ఇందులో 15 పీహెచ్​సీలు 24 గంటల హాస్పిటల్స్​గా ఉన్నాయి. 24 గంటల హాస్పిటల్స్​లలో నెలకు కనీసం 10 డెలివరీలు చేయాలనే టార్గెట్​ ఉంది. మిగిలిన పీహెచ్​సీలలోనూ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలున్నాయి. సుజాతనగర్, జగన్నాధపురం పీహెచ్​సీల్లో ఏడాదిగా ఒక్క డెలివరీ కూడా చేయకపోవడం గమనార్హం. 11 పీహెచ్​సీల్లో 50 లోపు ప్రసవాలు జరిగాయి.  జిల్లాలోని 29 పీహెచ్​సీల్లో గత ఆర్థిక సంవత్సరం 1,990 డెలివరీలు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 819 ప్రసవాలు మాత్రమే చేశారు.

పట్టణాలకు పరుగు

ఏడాదిగా జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్​ హాస్పిటల్స్​లలో 10,348, ప్రైవేట్​ హాస్పిటల్స్​లలో 4,898 డెలివరీలు అయ్యాయి. ఏప్రిల్​ నుంచి ఈ నెల 25 వరకు గవర్నమెంట్​ హాస్పిటల్స్​లలో 3,827, ప్రైవేట్​ హాస్పిటల్స్​లలో 1,463 డెలివరీలు జరిగాయి. కొత్తగూడెంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంతో పాటు పాల్వంచ, భద్రాచలం, ఇల్లందులోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​తో పాటు ప్రైవేటు హాస్పిటల్స్​కు ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా ప్రజలు పీహెచ్​సీలకు వెళ్లేందుకు వెనకాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డాక్టర్ల కొరతతో పాటు నిర్లక్ష్యం, అంతంత మాత్రంగా ఉన్న సౌకర్యాలు, డెలివరీ టైమ్​లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జిల్లా ఆసుపత్రికి రిఫర్​ చేసి చేతులు దులుపుకోవడంతో పల్లెల్లోని గర్భిణులు పైసలు ఖర్చయినా సమీపంలోని పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రికి వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. కొన్ని పీహెచ్​సీలలో సౌకర్యాలు ఉన్నా డాక్టర్ల కొరతతో డెలివరీలు పెద్దగా చేయడం లేదు. చర్ల మండలం సత్యనారాయణపురం పీహెచ్​సీలో గత ఏడాది 243 డెలివరీలు చేయడం విశేషం. 24 గంటల పీహెచ్​సీలలో ఏడాదికి కనీసం 120 డెలివరీలు చేయాల్సి ఉండగా 9 పీహెచ్​సీల్లో వంద లోపు ప్రసవాలే జరిగాయి. రేగళ్ల, పెనగడప, రొంపేడు, పట్వారీగూడెం, జానంపేట పీహెచ్​సీల్లో 25 లోపే ప్రసవాలు జరిగాయి. పీహెచ్​సీల్లో డెలివరీలు పెంచాలని హెల్త్​ మినిష్టర్, కలెక్టర్​ అనుదీప్​ ఆదేశిస్తున్నా మార్పు రావడం లేదని అంటున్నారు. పీహెచ్​సీల్లో డెలివరీలు జరిగేలా చూసేందుకు ప్రోగ్రాం ఆఫీసర్​ ఉన్నా పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఫలితం ఉండడం లేదని అంటున్నారు. పక్కనే సర్కారు దవాఖానా ఉన్నా భరోసా లేక డెలివరీల కోసం సమీప పట్టణానికి వెళ్తున్న గ్రామీణులకు నమ్మకం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది