హైదరాబాద్, వెలుగు: సైబర్ మోసాలకు పాల్పడ్డ నేరగాళ్లు ఇ– వ్యాలెట్ యాప్స్ నుంచి ఫేక్ అడ్రెస్, ఫోన్ నంబర్లతో తీసుకున్న బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకుంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఐపీ, బ్యాంక్ అడ్రస్, ఫోన్ నంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేసే పోలీసులకు నిందితులు పట్టుబడటం లేదు. ఎస్బీఐ క్రెడిట్కార్డ్స్ ఫేక్ కాల్ సెంటర్ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఢిల్లీ కేంద్రంగా నడిపిన ఫేక్ కాల్సెంటర్ రాకెట్ను ట్రేస్ చేసేందుకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ నెలరోజులు గ్రౌండ్ వర్క్ చేసింది. బాధితులు అందించిన ఫోన్ నంబర్, క్రెడిట్ కార్డ్ క్యాష్ ట్రాన్స్ఫరైన ఇ– వ్యాలెట్స్ ఆధారంగా దర్యాప్తు చేప్టటింది. ప్రధాన నిందితుడు నిఖిల్ మదాన్ గ్యాంగ్ ఫేక్ అడ్రెస్ లతో ఢిల్లీలో 50 అకౌంట్లను ఓపెన్ చేసినట్లు గుర్తించింది.
బిహార్ చక్నూర్కి చెందిన ముర్షిద్ ఆలంతో ఎమ్ఎస్ఐపీ, సిల్వర్ డైలర్, ఐ టెల్ మొబైల్ డైలర్ యాప్స్, యూపీ మొరాబాద్కి చెందిన ఫర్మాన్ హుస్సేన్తో ప్రొస్పోక్ హెచ్డీ.కమ్, రౌండ్ 2 హెల్. ఓఆర్జీ సైట్స్ ను నిఖిల్ మదాన్ డెవలప్ చేయించాడు. ఫేక్ కాల్ సెంటర్స్ తో క్రెడిట్ కార్డుల హోల్డర్స్ నుంచి డబ్బులు కొట్టేసి ఇ– వ్యాలెట్లలో డిపాజిటైన క్యాష్ను ఫేక్ ఐడీలతో తీసిన తమ బ్యాంక్ అకౌంట్లలోకి ఈ గ్యాంగ్ ట్రాన్స్ ఫర్ చేసుకుంది. ఏడాది కాలంగా ఫేక్ కాల్ సెంటర్స్ నుంచి నిఖిల్ మదాన్ గ్యాంగ్ సభ్యులు క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 33 వేల కాల్స్ చేశారు. ఇందులో 14,500 కాల్స్ను పోలీసులు యూనిక్ కాల్స్గా గుర్తించారు. యాప్స్ ద్వారా మరికొన్ని కాల్స్ చేసినట్లు ఆధారాలు సేకరించారు.
మారుమూల ప్రాంతాల్లో క్యాష్ విత్ డ్రా
ఇన్వెస్ట్మెంట్స్,జాబ్స్, గిఫ్ట్స్, బ్యాంక్ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఎస్ఎమ్ఎస్లో ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. నిజమైన కంపెనీల విధంగా మెయిల్స్,వాట్సాప్ లింక్స్ పంపుతున్నారు. క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్స్,పేరు,అడ్రెస్,పాన్,ఆధార్,బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ను కలెక్ట్ చేస్తున్నారు.చార్జీల పేరుతో అందినంత దోచేసి ఆ డబ్బును ఇ– వ్యాలెట్లలోకి మళ్లిస్తున్నారు. ఏజెంట్ల వద్ద బల్క్లో సిమ్ కార్డులు కొని ఆ నంబర్లను ఫేక్ ఐడీలతో తీసిన బ్యాంక్ అకౌంట్లకు ఇస్తున్నారు. ఆ అకౌంట్లకు ఇ– వ్యాలెట్లకు లింక్ చేస్తున్నారు. ఇ– వ్యాలెట్ నుంచి తమ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న డబ్బును దేశంలోని మారుమూల ప్రాంతాల్లో విత్ డ్రా చేస్తున్నారు. దీంతో ఇలాంటి సైబర్ ఫ్రాడ్ కేసుల్లో నిందితులను గుర్తించడంతో పాటు క్యాష్ రికవరీ పోలీసులు సవాళ్లుగా మారుతోంది.