
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎగువ ప్రాంతంలోని సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మంజీరా నదికి భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. కోల్చారం మండల పరిధిలోని ఘనపూర్ ఆనకట్ట పొంగి పొర్లుతోంది.
Also read:-కడెం దడ పుట్టిస్తోంది.. జలాశయం నిండింది.. నీటిని దిగువకు వదిలారు... !
ఏడుపాయల అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజ గోపురంలోనే వనదుర్గ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భారీ వరదల అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. దీంతో భక్తుల రాకపై నిషేధం విధించారు. వరద తాకిడి తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయం చుట్టూ నీరు ప్రవహిస్తోంది. గర్భగుడి వద్ద నది ప్రవాహం కొనసాగుతోంది.
సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. నాలుగు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇరిగేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ... ఇన్ ఫ్లో 40069 క్యూసెక్కులు... ఔట్ ఫ్లో 30358 క్యూసెక్కులు .. పూర్తి సామర్ధ్యం 29.917 టీఎంసీలు.. ప్రస్తుత నీటి మట్టం 17.955 టీఎంసీలు గా కొనసాగుతుంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 1986 క్యూసెక్కుల నీటిని పంపిణి చేస్తూ జెన్ కో అధికారులువిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.