న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆమ్ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎంపీ టికెట్ కోసం తన తండ్రి నుంచి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ 6 కోట్లు తీసుకున్నారని..పశ్చిమ ఢిల్లీ ఆప్ అభ్యర్థిగా బరిలో ఉన్న బల్బీర్ సింగ్ జక్కర్ కుమారుడు ఉదయ్ జక్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మూన్నెళ్ల కిందటే ఆప్లో చేరారని, అన్నా హజారే ఉద్యమంతో ఏ సంబంధం లేని వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మాజీ కాంగ్రెస్ నేత, 1984 సిక్కుల ఊచకోత కేసు నిందితుడు సజ్జన్ కుమార్ను బెయిల్ పై విడిపించేందుకు తన తండ్రి బల్బీర్ సింగ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘‘నా చదువుల కోసం డబ్బు అడిగితే అందుకు కాదన్నారు. అది రాజకీయ ప్రయోజనాలకు వాడాల్సి ఉందని చెప్పారు. అందుకే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా” అంటూ శనివారం ట్విట్టర్లో పోస్టు చేశారు.
గడువు ముగిసినా ఆప్ ప్రచారం: కాంగ్రెస్ ఫిర్యాదు
గడువు ముగిసినప్పటికీ ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా తప్పుడు సర్వే ఫలితాలను ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ శనివారం ఫిర్యాదు చేసింది. రికార్డు చేసిన ఫోన్కాల్స్ ను ఆధారాలుగా ఇచ్చింది. తప్పుడు సర్వే ఫలితాలను వివరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.