ఉత్తర అమెరికా, యూరోప్లలో1917–1928 మధ్య ప్రాంతంలో 500 వేల మంది ఒక మిస్టీరియస్ వ్యాధి బారిన పడ్డారు. ఈ జబ్బు వచ్చిన వాళ్లు మంచానికి పరిమితం అయ్యేవాళ్లు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. కానీ శరీరంలో ఏ భాగాన్నీ కదల్చలేరు. నోరువిప్పి మాట్లాడలేరు. అలా కొన్ని రోజులు, వారాలు లేదా నెలలు ఉన్నాక చనిపోయిన వాళ్లు కొందరైతే, బతికిన వాళ్లు మరికొందరు. ఆ బతికిన వాళ్లేమో ఇలా బతకడం కంటే ప్రాణం పోయినా బాగుండేది అనుకునేంత ఇబ్బంది పడ్డారు.
ఇదంతా చదవగానే కోమా స్టేజీ అనిపిస్తుంది. కానీ ఈ వ్యాధిని ఎన్సెఫలైటిస్ లెథర్కిజా(ఇ.ఎల్.) అంటారు. వాడుక భాషలో చెప్పాలంటే స్లీపింగ్ సిక్నెస్. మెడికల్ టర్మినాలజీలో ఇలాంటి స్థితిని కెటాటోనిక్ స్టేట్ అంటారు. ఈ జబ్బు మొట్టమొదట యూరోప్లో కనిపించింది. ఆ తరువాత ప్రపంచమంతటా వ్యాపించింది. ఉత్తర అమెరికా, యూరోప్, ఇండియాల్లో 1919వ సంవత్సరంలో ఎపిడమిక్ లెవల్కి చేరింది. త్వరలోనే దానిమీద పరిశోధనలు చేసి న్యూరలాజికల్ డిసీజ్గా నిర్ధారించారు. ఈ జబ్బు వచ్చిన వాళ్లలో న్యూరలాజికల్ డిస్ఫంక్షన్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండేది. బతికిన వాళ్లలో పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు లేదా న్యూరోసైకియాట్రిక్ సమస్యలు ఉండేవి.ఈ డిసీజ్కి కారణాన్ని 1919లో తెలుసుకోగలిగారు. లక్షల మంది ప్రజలు జ్వరం, తలనొప్పి, మందగించిన చూపు, డబుల్ విజన్, అప్పర్ బాడీ వీక్నెస్, కండరాల నొప్పి వంటి లక్షణాల బారిన పడ్డారు. ఈ లక్షణాలతో పాటు ఆలోచనా శక్తి తగ్గడం, కదలికలు తగ్గిపోవడం, డబుల్ విజన్, డెలీరియమ్, పెరాలసిస్ వంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి. కొందరిలో పైన చెప్పిన లక్షణాలు ఒకేసారి కాకుండా నెమ్మదిగా పెరిగాయి, కానీ కొందరిలో మాత్రం ఎటువంటి వార్నింగ్ సిగ్నల్స్ లేకుండానే పక్షవాతం బారిన పడ్డారు.
చచ్చి బతికినట్టు
కదలికలు నెమ్మదించినప్పుడు చాలామంది అదో జబ్బు అనే విషయం గుర్తించలేకపోయాం. ఏదో ఒకరోజు పూర్తిగా కదల్లేని స్థితికి వస్తారు. అప్పుడు కానీ విషయం తెలిసేది కాదు. ఇ.ఎల్. ఎటువంటి వార్నింగ్ లేకుండానే దాడిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన కొందరు ‘‘ఆ టైంలో ఫ్రీజ్ అయ్యాం. కానీ మా చుట్టూ ఏం జరుగుతుందనే విషయం బాగా తెలిసింది. బలవంతంగా ఎవరో కదలనీయకుండా పట్టుకున్నట్టు లేదా బ్రెయిన్ సిగ్నల్స్ ఆపేసినట్టు అనిపించిందని చెప్పారు. కొందరు కొన్నాళ్ల తరువాత మామూలుగా లేచి తిరిగారు. కొందరు మాత్రం జీవితంలో కదల్లేదు. ఏదో పనిచేస్తున్నప్పుడో, పడుకుని ఉన్నప్పుడో కదలకుండా ఉండే ఈ పరిస్థితి గంటలు, రోజుల నుంచి వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులే ఉండేది. కొన్ని కేసుల్లో అయితే ఏండ్ల తరబడి బిగుసుకుపోయారు. ముందుగా ఎటువంటి లక్షణాలు లేకుండా దీని బారిన ఎందుకు పడుతున్నారనే విషయం తెలుసుకునేందుకు సైంటిస్ట్లు పరిశోధనలు చేస్తున్నారు. వ్యాధి విజృంభించినప్పుడు చేసిన పరిశోధనల్లో స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా స్పెషల్ స్ట్రెయిన్ ఇది అని కనుగొన్నారు. వాస్తవానికి శీతాకాలంలో జలుబు, గొంతునొప్పులకు కారణమయ్యే బ్యాక్టీరియా ఇది. ఆ బ్యాక్టీరియానే అసాధారణంగా బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్(మెదడు వాపు)కు కారణం అయ్యి మోటార్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపించి మనుషుల్ని మంచానికి కట్టిపడేస్తుంది అని తేల్చారు.
మళ్లీ ఇలా వెలుగులోకి...
పన్నెండేండ్ల అమ్మాయి ఒక కాన్సర్ట్కు వెళ్లాలని బయల్దేరింది. కొంచెం దూరం వెళ్లాక శరీరంలో ఒకవైపు పక్షవాతం వచ్చింది. ఇదేంటి అకస్మాత్తుగా ఇలా అయిందని ఆలోచించే లోపే శరీరంలో రెండో వైపు కూడా పక్షవాతానికి గురైంది. బాడీ అంతా పారలైజ్ అయిన అరగంటలో ఆ అమ్మాయి నిద్రలోకి జారిపోయింది. ఆ తరువాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి చనిపోయింది. అకస్మాత్తుగా ఇలాగెందుకు అయిందని రీసెర్చ్ చేస్తుంటే కొన్నేండ్ల క్రితం ప్యాండెమిక్ అయ్యి సడన్గా మాయమైన మెడికల్ మిస్టరీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మెడికల్ మిస్టరీ ప్రపంచాన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది. అక్కడక్కడ మళ్లీ కనిపిస్తోంది. 2004 లో ఎన్సెఫలైటిస్ లెథర్జికా బారిన పడిన 20 మందిని స్టడీ చేసి నిద్ర మహమ్మారి రోగం రిస్క్ ఇంకా పోలేదని చెప్పారు సైంటిస్ట్లు.ఈ జబ్బున పడి కొన్ని దశాబ్దాల నిద్ర తరువాత మేలుకున్న పేషెంట్ల గురించి 1973లో ‘అవేకెనింగ్స్’ అనే పుస్తకాన్ని రాశాడు ఆలివర్ సాక్స్ అనే న్యూరాలజిస్టు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని1990లో ‘అవేకనింగ్’ అనే సినిమా తీశారు. అందులో రాబర్ట్ డి నీరో, రాబిన్ విలియమ్స్ నటించారు. ఈ సినిమా అప్పట్లో అకాడమీ అవార్డ్కు నామినేట్ అయింది.