లిక్కర్ ​జోరుకు ఈసీ బ్రేకులు

లిక్కర్ ​జోరుకు ఈసీ బ్రేకులు
  • ఈసీ చర్యలతో రంగంలోకి ఎక్సైజ్​ ఆఫీసర్లు 
  •  ఊరూరా బెల్టుషాపులపై ఉక్కుపాదం
  •  కేసుల నమోదుతో 90 శాతం బెల్టుషాపులు, సిట్టింగులు బంద్​
  •  సేల్స్​ టార్గెట్​ను కూడా 30 శాతం తగ్గించిన ఆబ్కారీ శాఖ
  •  పదిరోజుల్లో పడిపోయిన సేల్స్​

నల్గొండ, వెలుగు:  రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యానికి ఈసీ చర్యలతో అడ్డుకట్ట పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూలింగ్​పార్టీకి తెరవెనుక సహరిస్తున్నారనే అనుమానమున్న 20 మంది ఐఏఎస్​, ఐపీఎస్​ ఆఫీసర్ల పై ఈ నెల 10న ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే!  దీనికితోడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా మారుతుండడంతో అలర్టయిన  ఆఫీసర్లు ఈసారి ఎలక్షన్​ కోడ్​ పక్కాగా అమలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు చెక్​పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా పెద్దమొత్తంలో నగదు పట్టుకుంటుండగా, జిల్లాల్లో ఆబ్కారీ ఆఫీసర్లు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ బెల్టుషాపు కనపడితే అక్కడ సీజ్​ చేసి, కేసులు రాస్తున్నారు. గతంలో ఎలక్షన్​ నోటిఫికేషన్​ వచ్చి, నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక గానీ లిక్కర్​జోలికి వచ్చేవారు కాదు. కానీ, ఈసారి ఈసీ సీరియస్​గా  నెల రోజుల ముందుగానే రాష్ట్రంలో లిక్కర్​అమ్మకాలపై  ఆంక్షలు విధిస్తుండడంతో సేల్స్​ పడిపోతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్తున్న బెల్టుషాపులు..

ఈనెల 10 నుంచి రాష్ట్రంలో లిక్కర్ ​సేల్స్​పై ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా పోలీస్​, ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో గల్లీ గల్లీ తిరుగుతూ బెల్టుషాపులు మూయిస్తున్నారు. తిరిగి తెరిస్తే కేసులు బుక్​ చేస్తున్నారు. ఆఫీసర్ల దాడులు, హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా 90శాతం దాకా బెల్టుషాపులు, అక్రమ సిట్టింగ్​లు బందయినట్లు ఆబ్కారోళ్లు చెప్తున్నారు. మరోవైపు  ఎన్నికల నిబంధనల మేరకు డిపోల్లో లిక్కర్​ సేల్స్​ను కంట్రోల్​ చేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణంగా ప్రతినెలా గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ స్టాక్​ అమ్ముకునేందుకు ఆబ్కారోళ్లు  పర్మిషన్​ ఇస్తారు. ఎన్నికల టైంలో  రాజకీయ పలుకుబడితో కొన్ని చోట్ల కోటాను మించి 70,80 శాతం దాకా సేల్స్​ జరిగినా ఎక్సైజ్ ​వాళ్లు చూసీచూడనట్లు ఉండేవారు.  కానీ, ఈసారి ఈసీ ఆదేశాలతో నెల రోజుల ముందు నుంచే డిపోలపై నిఘా పెట్టారు. 50 శాతం అదనపు కోటాను 30 శాతానికి తగ్గించారు. అంతకుమించి అదనంగా ఒక్క చుక్క మద్యానికి కూడా పర్మిషన్​ ఇవ్వట్లేదు. అదీగాక డిపోల్లో స్టాక్​గురించి, సేల్స్​ గురించి ఎ​ప్పటికప్పుడు ఎలక్షన్​ కమిషన్​కు రిపోర్ట్​ పంపుతున్నారు. రూల్స్​ ప్రకారం ఎవరూ ఆరు ఫుల్​ బాటిల్స్​, ఒక కాటన్​ బీర్లుకు మించి వెంట తీసుకెళ్లకూడదు. మోతాదుకు మించి లిక్కర్​ ట్రాన్స్​పోర్ట్​ చేస్తే చెక్​పోస్టుల వద్ద సీజ్​ చేస్తున్నారు. వైన్సుల్లో కస్టమర్లకు బిల్లులు ఇవ్వకపోడంతో సీజ్​ చేసిన లిక్కర్​ను విడిపించుకోవడం కష్టమవుతోంది. దీని వల్ల కూడా లిక్కర్​సేల్స్​పై ఎఫెక్ట్​పడుతోంది.

భారీగా పడిపోయిన సేల్స్​.. 

ఈసీ, ఆబ్కారీ శాఖ చర్యలతో లిక్కర్​ సేల్స్​ పడిపోతున్నాయి. గతేడాది అక్టోబర్​ 9 నుంచి 19 తేదీ వరకు 19.40 లక్షల పెట్టెల లిక్కర్​, బీర్లు అమ్ముడుపోయాయి.  ఈసారి 50 శాతం ఎక్సెస్​ సేల్స్​ కలుపుకొని వ్యాపారులకు 29.10 లక్షల కాటన్ల వరకు టార్గెట్​ పెట్టారు. ఈసీ చర్యలతో ఆఫీసర్లే టార్గెట్ ను​ 30 శాతానికి తగ్గించారు. దీంతో ఈ పదిరోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సేల్స్​ 26 లక్షల కాటన్ల వద్దే ఆగిపోయాయి. బెల్ట్​షాపులు మూతపడడంతో రోజుకు రూ.5లక్షల అమ్మకాలు జరిగే షాపుల్లో రూ. 2 లక్షలకు మించి సేల్స్​ జరగట్లేదని ఆఫీసర్లు చెపుతున్నారు.