భారత్ లో కోవిడ్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చిన ఫేస్‌బుక్‌

భారత్ లో కోవిడ్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చిన ఫేస్‌బుక్‌
  • యుఎస్‌ తర్వాత ఈ ఫీచర్‌ను ఆవిష్కరించిన రెండో దేశం ఇండియా

కోవిడ్‌–19 సంబంధిత సమాచారం పంచుకునేందుకు ఉపయోగపడే కోవిడ్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఫీచర్‌ ను భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్‌బుక్‌. దేశ వ్యాప్తంగా  కోవిడ్‌–19 సంబంధిత సమాచారాన్ని తమ కమ్యూనిటీలకు పంచుకునేందుకు అవసరమైన ఉపకరణమిది. యుఎస్‌ తరువాత ఈ ఫీచర్‌ను ఆవిష్కరించిన రెండవ దేశం ఇండియా. ఇప్పటికే భారతదేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకువచ్చామని,  ఆరోగ్య శాఖలకు సమయానుకూల, విశ్వసనీయ కోవిడ్‌–19 సమాచారంతో పాటుగా టీకా సంబంధిత సమాచారాన్నీ తమ స్థానిక కమ్యూనిటీలు/రాష్ట్ర పరిధిలోని ప్రజలతో పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ఫేస్ బుక్ చెబుతోంది. రాష్ట్రాలు ఈ హెచ్చరికలను తమ రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే తమ రాష్ట్రాలలోని నిర్థిష్టమైన నగరాలకు మాత్రమే పరిమితం చేయవచ్చు. ఫేస్‌బుక్‌పై రాష్ట్ర ఆరోగ్య శాఖ పేజీలపై పోస్ట్‌చేసినప్పుడు కోవిడ్‌–19 ఎనౌన్స్‌మెంట్స్‌గా మార్క్‌ చేస్తే తాము వాటి చేరికను మరింతగా విస్తరిస్తూ వారి కమ్యూనిటీకి చేరవేస్తామని తద్వారా వారు చూసేందుకు తగిన అవకాశం అందిస్తామని చెబుతోంది. ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు నోటిఫికేషన్లను తాము పంపడంతో పాటుగా ఆ సమాచారాన్ని కోవిడ్‌–19 సమాచార కేంద్రం వద్ద చూపుతామని ఫేస్ బుక్ వెల్లడించింది.