
మెదక్ వరుసగా మూడవ కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో… ఆ బిడ్డను పోషించలేక ఓ గిరిజన మహిళ రూ.5000 కు అమ్మకానికి పెట్టింది. ఓ ఆశ కార్యకర్త మధ్యవర్తిత్వంతో మరో మహిళ ఆ శిశువును తీసుకునేందుకు సిద్ధమైంది. ఆసుపత్రిలో డెలివరీ చేసిన డాక్టర్ కు ఈ విషయం తెలియడంతో శిశువు విక్రయం ఆలస్యంగా బయటపడింది.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్టకుల్ గ్రామ పంచాయతీలోని బద్రియ తండాకు చెందిన లంగోత్ దుర్గా,సంగీతాలకు ఇద్దరు ఆడపిల్లలు. గత ఆదివారం సంగీతాను మూడో కాన్పు కోసం ఆమె కుటుంబసభ్యులు మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.మూడో కాన్పు లో కూడా ఆడపిల్ల జన్మించడం తో పిల్లల ఆర్ధిక భారం భరించలేక పుట్టిన ఆడపిల్లను బుధవారం నాడు అమ్మకానికి పెట్టింది సంగీతా. ఇందుకు నాగ మణి అనే ఆశ కార్యకర్త మధ్యవర్తిత్వం వహించింది. రాధ అనే మహిళకు 5000 వేల రూపాయలకు శిశువును అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ విషయం డెలివరీ చేసిన డాక్టర్ కు తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు ను నమోదు చేసి (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్) అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ శిశువును కన్న తల్లికి అప్పగించారు. మధ్యవర్తిత్వం వహించిన ఆశ కార్యకర్త పై కేసును నమోదు చేశారు. తనకు పిల్లలు లేక పోవడంతో ఆ బిడ్డను కొనుక్కున్నట్లు రాధ చెప్తుంది. ఆ విషయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.